Begin typing your search above and press return to search.

కేసీఆర్ కరుణిస్తాడా? కాలదన్నుతాడా?

By:  Tupaki Desk   |   21 Nov 2019 5:38 AM GMT
కేసీఆర్ కరుణిస్తాడా? కాలదన్నుతాడా?
X
ఆర్టీసీ కార్మిక సంఘాలు చేతులెత్తేశాయి.. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించాయి. కార్మికులు తమను చేర్చుకోవాలని.. కేసీఆర్ మనసు మారాలని దేవుడికి వినతిపత్రాలు ఇస్తున్నారు. కేసీఆర్ చెప్పినా వినకుండా సమ్మె చేసిన కార్మికులు ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యాయి. కార్మిక నేతలను నమ్ముకొని నిండా మునిగారు.

నవంబర్ 5 అంటూ కేసీఆర్ విధించిన డెడ్ లైన్ కు కొందరు కార్మికులు కరిగి విధుల్లో చేరారు.కానీ కార్మిక నేతలు భయపెట్టి వారిని సమ్మెలోకి తీసుకొచ్చారు. కేసీఆర్ అంటేనే పంతానికి నిదర్శనం. ఆయన చెప్పినా వినకుండా సమ్మె చేసిన కార్మికులు.. ఇప్పుడు విధుల్లో చేరుతామని వస్తున్నా కేసీఆర్ సర్కారు స్పందించడం లేదు. ఇప్పుడు కార్మికులకు ఆ సంఘాలు ఏం జవాబు చెప్తాయన్నది ఆసక్తిగా మారాయి.

ఆర్టీసీ సంఘాలు, నేతలు.. సంస్థను ముంచేస్తున్నారని కేసీఆర్ మీడియా సాక్షిగా ఆరోపించారు. ఇప్పుడు అదే నిజమైందని కార్మికులు వాపోతున్నారు. 48 రోజుల పాటు సమ్మె చేసి సాధించిందేమిటని కార్మిక నేతలను ఆర్టీసీ కార్మికులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఇప్పుడు ఏ హామీతో సమ్మె విరమిస్తున్నారో చెప్పాలని పలువురు జేఏసీ నేతలను నిన్న సమావేశంలో నిలదీసినట్లు తెలిసింది. సమ్మె సాగడంలో కీలక పాత్ర పోషించిన అశ్వత్థామ రెడ్డిని ఇప్పుడు కార్మికులు, ప్రభుత్వం కూడా లక్ష్యంగా చేసుకుంది. సమ్మె విరమించడానికి కారణం కార్మికులకు ఏం చెబుతారని.. దీనివల్ల ప్రభుత్వానికి సంఘాలు పలుచన అవుతాయంటూ కొందరు కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు కేసీఆర్ కీలకంగా మారారు. ఆయన కరుణిస్తాడా? కాలదన్నుతాడా అన్నదే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకొని కార్మిక సంఘాలు లేని సంస్థను నడిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. సమ్మె విరమించే విధుల్లో చేరే కార్మికులను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం.. యూనియన్లతో సంబంధం లేదంటూ డిక్లరేషన్ తీసుకొనే విధుల్లోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదే జరిగితే దశాబ్దాలుగా ఆదిపత్యం చెలాయిస్తున్న కార్మిక సంఘాల నేతలకు ఇక చెక్ పడనుంది. అశ్వత్థామ, రాజిరెడ్డి లాంటి నేతల భవితవ్యం అగమ్యగోచరం కానుందనే వాదన వినిపిస్తోంది.