Begin typing your search above and press return to search.

నిరుద్యోగం.. పెళ్లిళ్లపై ‘పవర్ ’ పంచ్..!

By:  Tupaki Desk   |   5 Jan 2023 2:30 PM GMT
నిరుద్యోగం.. పెళ్లిళ్లపై ‘పవర్ ’ పంచ్..!
X
దేశంలో నిరుద్యోగం.. ద్రవ్యోల్భణం నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ద్రవ్యోల్భణం కట్టడికి అనేక చర్యలు చేపడుతోంది. అయితే నిరుద్యోగంపై కేంద్రం సరైన రీతిలో స్పందించడం లేదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ నివేదికలు సైతం భారత్ లో నిరుద్యోగ స్థాయి గతంతో పోలిస్తే భారీగా పెరిగినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే..!

నిరుద్యోగం పెరగడం వల్లే యువకులకు సరైన వయసులో పెళ్లిళ్లు కావడం లేదంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఎన్సీపీ జన్ జాగర్ యాత్ర ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందు శరద్ పవర్ ఈ వ్యాఖ్యలు చేయగా అది కాస్తా వైరల్ గా మారాయి. దేశంలో నిరుద్యోగం పెరగడానికి కేంద్రం వైఖరినే కారణమని శరద్ పవర్ విమర్శించారు.

కేంద్రంలోని బీజేపీ సర్కార్ వర్గాల మధ్య చీలికలు తెస్తుందని ఆరోపించారు. ద్రవ్యోల్భణం.. నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యల నుంచి యువతను దారి మళ్ళించే ప్రయత్నం కేంద్రం చేస్తుందన్నారు. మన రైతులు ఉత్పత్తిని పెంచడం వల్లే దేశంలో ఆకలి సమస్య తీరుతుందన్నారు. అయితే అధికారంలో ఉన్న వ్యక్తులు మాత్రం రైతులకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని విమర్శించారు. దీనికి బదులుగా మధ్యవర్తులకు ప్రయోజనం చేకూరేలా పాల్పడుతున్నారని శరద్ పవర్ వ్యాఖ్యానించారు.

నేటి యువత విద్యావంతులని.. వారికి ఉద్యోగాలు కోరే హక్కు ఉందని ఆయన గుర్తు చేశారు. మహారాష్ట్ర పరిశ్రమలకు ప్రోత్సాహం లభించడం లేదన్నారు. దీంతో అనేక పరిశ్రమలు రాష్ట్రం వదిలి వెళ్లి పోతున్నాయని.. కొత్త వ్యాపారాలు చేసుకునే అవకాశాలు కూడా కల్పించడం లేదన్నారు. దీంతో నిరుద్యోగ సమస్య గణనీయంగా పెరిగిపోతుందని వెల్లడించారు.

తాను ఒక గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో 25 నుంచి 30 ఏళ్లు వయస్సున్న 15 నుంచి 20 మంది పురుషులు ఖాళీగా కన్పించారని తెలిపారు. వీరిని మీరంతా ఏమి చేస్తున్నారని ప్రశ్నంచగా అంతా గ్రాడ్యూయేట్.. పోస్ట్ గ్రాడ్యూయేట్లు చేసినట్లు చెప్పారని వివరించారు. మీరు వివాహం చేసుకున్నారా? అని ప్రశ్నిస్తే అంతా కూడా ప్రతికూలంగా స్పందించారని శరద్ పవర్ తెలిపారు. విషయం ఏంటని ఆరా తీయగా తమకు ఉద్యోగాలు లేకపోవడంతో అమ్మాయిలను ఇవ్వడానికి వారి తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారని చెప్పారు.

ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందన్నారు. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి బదులుగా వర్గాలు.. మతాలుగా విభజించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని శరద్ పవర్ విమర్శించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.