Begin typing your search above and press return to search.

బాలయ్య, జగన్‌ ఒకచోట కలసిన వేళ!

By:  Tupaki Desk   |   16 Nov 2022 8:30 AM GMT
బాలయ్య, జగన్‌ ఒకచోట కలసిన వేళ!
X
ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు ఒకచోట కలిస్తే వారి మధ్య మాటలు చోటు చేసుకుంటాయా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అయితే అసలు సాధ్యం కాదనే చెప్పొచ్చు.

ఇప్పుడు ఇలాంటి ఘటనే సూపర్‌ స్టార్‌ కృష్ణకు చెందిన పద్మాలయ స్టూడియోలో జరిగింది. కృష్ణకు నివాళులు అర్పించడానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌లోని పద్మాలయ స్టూడియోస్‌కు వచ్చారు. అప్పటికే అక్కడ ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉన్నారు. ఆయనతోపాటు ఆయన భార్య వసుంధర, కుమార్తె బ్రాహ్మణి కూడా వచ్చారు.

బాలకృష్ణ కుటుంబం వచ్చిన కాసేపటికే సీఎం జగన్‌ వచ్చారు. అప్పుడు బాలకృష్ణ కుటుంబమంతా అక్కడే ఉంది. బాలకృష్ణ .. మహేశ్‌ బాబు పక్కనే ఉన్నారు. అయినా సరే సీఎం జగన్‌ కానీ, బాలయ్య కానీ మర్యాదపూర్వకంగా నమస్కారం చేసుకోవడం కానీ, పలకరించుకోవడం కానీ చేయలేదు.

బాలకృష్ణ.. జగన్‌ను పట్టించుకోనట్టే ఉండిపోగా జగన్‌ సైతం అదే రీతిలో వ్యవహరించారు. ఇక బాలయ్య భార్య వసుంధర, కుమార్తె బ్రాహ్మణి... కృష్ణ కుమార్తెలు, మనవరాళ్లతో మాట్లాడుతూ ఉండగా జగన్‌ రావడంతో బ్రాహ్మణి, వసుంధర పూర్తిగా వెనక్కి వెళ్లిపోయారు.

ఇక అక్కడే ఉన్న మహేశ్‌ బాబు బావ, గుంటూరు టీడీపీ ఎంపీ గళ్లా జయదేవ్‌ను మాత్రం వైఎస్‌ జగన్‌ తనంతట తానుగానే పలకరించారు. ఆయన చేతులను తన చేతుల్లోకి తీసుకున్నారు. అలాగే గల్లా జయదేవ్‌ తల్లి, మాజీ మంత్రి గళ్లా అరుణకుమారి సైతం జగన్‌ వచ్చినప్పుడు భౌతిక కాయం వద్దే ఉన్నారు. ఆమె సైతం జగన్‌ను పట్టించుకోనట్టే ఉండిపోయారు.

మహేష్‌ బాబును ఓదార్చిన జగన్‌ అక్కడే ఉన్న కృష్ణ కుమార్తెలు మంజుల, ప్రియదర్శిని వారి పిల్లలను పలకరించారు. కృష్ణ కుమార్తె మంజుల తమ పిల్లలను జగన్‌కు పరిచయం చేశారు.

అదేవిధంగా కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, సినీ నటుడు నరేష్‌లను పలకరించిన జగన్‌.. కృష్ణకు నివాళులు అర్పించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.