Begin typing your search above and press return to search.

జగన్ క్యాబినెట్ 2.0లో చోటు దక్కేదెవరికి?

By:  Tupaki Desk   |   31 March 2022 7:30 AM GMT
జగన్ క్యాబినెట్ 2.0లో చోటు దక్కేదెవరికి?
X
ప్రమాణ స్వీకారం రోజునే పదవీ గండం ఉందని చెప్పటంతో పాటు.. రెండున్నరేళ్ల తర్వాత కొత్త టీంను తీసుకుంటానని చెప్పేసి మరీ మంత్రి పదవులు ఇచ్చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. తాను చెప్పినట్లే కొత్త కేబినెట్ కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా కొత్త కేబినెట్ 2.0కు ముహుర్తం కూడా డిసైడ్ చేయటం తెలిసిందే. ఏప్రిల్ 11న ఉదయం 11.31 గంటల వేళలో కొత్త మంత్రులు పదవీ ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త జట్టులో ఉండేదెవరు? అన్న చర్చ జోరందుకుంది.

ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు ఉన్న 13 జిల్లాలకు బదులుగా కొత్త జిల్లాలకు తగ్గట్లు తాజా మంత్రివర్గ కూర్పు ఉంటుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కొత్త జిల్లాలకు సంబంధించి ఒక్కో జిల్లాకు ఒక్కో మంత్రిని ఎంపిక చేస్తారన్న మాట వినిపిస్తోంది. జిల్లాల వారీగా ఆశావాహులు ఎవరు? అవకాశాలు ఎక్కువగా ఉన్నదెవరికి అన్న విషయానికి వస్తే.. శ్రీకాకుళం ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్.. మంత్రి సీదిరి అప్పల రాజులు ఉన్న సంగతి తెలిసిందే. జిల్లాకు సంబంధించి తమ్మినేని సీతారాం స్పీకర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరిలో ఒకరు మాత్రమే మంత్రివర్గంలో కంటిన్యూ అవుతారని చెబుతున్నారు. దీంతో.. కొత్తగా ఎవరికి అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఒకవేళ.. అనూహ్యంగా ఇద్దరిని మంత్రి వర్గం నుంచి తొలగిస్తే మాత్రం స్పీకర్ గా ఉన్న తమ్మినేనికి మంత్రివర్గంలో చోటు దక్కటం ఖాయమంటున్నారు.

విజయనగరం ప్రస్తుతం మంత్రిగా బొత్స సత్యానారాయణ ఉన్నారు. ఆయన్ను తప్పించే అవకాశం లేదు. ఒకవేళ తప్పిస్తే మాత్రం కోలగట్ల వీరభద్రస్వామి.. కంబాల జోగులులో ఒకరికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ విజయవాడకు చెందిన మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ను తప్పిస్తే మాత్రం ఆయన సామాజిక వర్గానికి చెందిన కోలగట్ల వీరభద్ర స్వామికి అవకాశం ఉంటుందంటున్నారు. ఇదేమీ కాదంటే ఎస్సీ కోటాలో జోగులుకు అవకాశం ఉందని.. ఇదేమీ కాకుండా బొత్స ఫ్యామిలీలోనే పదవి ఇవ్వాలంటే మాత్రం అప్పల నరసయ్యకు ఛాన్సు ఉంటుందంటున్నారు.

మన్యం జిల్లా పీడిక రాజన్న దొర.. విశ్వాస రాయి కళావతిలో ఒకరికి అవకాశం ఖాయమంటున్నారు. అల్లూరి సీతారామారాజు జిల్లా భాగ్యలక్ష్మీ.. నాగుల పల్లి ధనలక్ష్మిల్లో ఒకరికి అవకాశం ఉంది. అనకాపల్లి బీసీ కోటాలో బూడి ముత్యాల నాయుడు.. కాపు కోటాలో గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. కరణం ధర్మశ్రీ కూడా రేసులో ఉన్నారు. విశాఖపట్నం అవంతి శ్రీనివాస్ కు కాపు కోటాలో మంత్రిగా ఉన్నారు. బీసీకి ఇవ్వాలంటే మాత్రం తిప్పల నాగిరెడ్డికి ఛాన్సు ఉంది. కాకినాడ కన్నబాబును తప్పిస్తే ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాల మధ్య తీవ్ర పోటీ ఉంది. కన్నబాబును పక్కన పెడితే రాజాకే పదవి దక్కే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా కాపు కోటా కింద అయితే జక్కంపూడి రాజాకు.. ఎస్సీ కోటాలో అయితే తలారి వెంకట్రావుకు అవకాశం లభించే వీలుంది.

కోనసీమ ప్రస్తుతం ఈ జిల్లాకు సంబంధించి వేణుగోపాలక్రిష్ణ.. పినిపె విశ్వరూప్ లు మంత్రులుగా ఉన్నారు ఇద్దరిలో ఒకరిని కొనసాగించే వీలుందంటున్నారు. ఇద్దరిని తొలగిస్తే చిట్టిబాబుకు అవకాశం ఉంది. ఏలూరు ఉప ముఖ్యమంత్రి ఆళ్లనానిని పక్కన పెడితే తెల్లం బాలరాజుకు కానీ ఎస్సీ కోటాలో ఎలీజా కు అవకాశం ఉంది. ఒకవేళ క్రిష్ణా జిల్లాలో కొడాలి నానిని పక్కన పెడితే.. ఆయన సామాజిక వర్గానికి చెందిన కొఠారు అబ్బయ్య చౌదరికి అవకాశం లభించనుంది. నరసాపురం ప్రస్తుతం మంత్రి శ్రీరంగనాథ రాజును తొలగిస్తే.. ఆయన సామాజిక వర్గానికి చెందిన ముదునూరి ప్రసాదరాజుకు ఛాన్సు ఉంది. ఇదేమీ కాదంటే జెయింట్ కిల్లర్ గ్రంధి శ్రీనివాస్ కు అవకాశం లభించే వీలుంది. పవన్ను ఓడించిన ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవటం ద్వారా చక్కటి సందేశాన్ని ఇచ్చే వీలుందంటున్నారు.

క్రిష్ణా కొడాలి నాని.. పేర్ని నానిల్లో ఎవరిని కొనసాగించినా ఇతరులకు అవకాశం ఉండదు. ఒకవేళ అనూహ్యంగా ఇద్దరిని తప్పిస్తే మాత్రం కొలుసుపార్థసారధి.. జోగి రమేశ్ లలో ఒకరికి చోటు లభించే వీలుంది. ఎన్టీఆర్ జిల్లా వెల్లంపల్లి శ్రీనివాసరావును తప్పిస్తే.. రక్షణ నిధికి అవకాశం ఉంది. లేదంటే సామినేని ఉదయభానుకు.. మల్లాది విష్ణుల్లో ఎవరో ఒకరికి మంత్రి పదవి దక్కే వీలుంది. గుంటూరు ఎస్సీ కోటాలో మేకతోటి సుచరిత హోం మంత్రిగా ఉన్నారు. ఆమెను తప్పిస్తే.. ఆళ్ల రామక్రిష్ణారెడ్డికే ఎక్కువ అవకాశం ఉంది. ఇది కాదంటే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డికి కానీ అంబటి రాంబాబులలో ఒకరికి పదవి దక్కే వీలుంది. బాపట్ల కోనా రఘుపతి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు.

ఆయనకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని చెబుతున్నారు. ప్రకాశం ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఆదిమూలపు సురేష్ లలో ఎవరికి కొనసాగించినా ఇంకెవరికి ఛాన్సు లభించదు. ఇద్దరిని తప్పిస్తే మద్దిశెట్టి వేణుగోపాల్.. టీజేఆర్ సుధాకర్ బాబుల్లో ఒకరికి అవకాశం ఉంది. నెల్లూరు మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ స్థానాన్ని కదపకపోవచ్చని అంటున్నారు. జిల్లాకు చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం నేపథ్యంలో అనిల్ ను కొనసాగిస్తే సరి. లేదంటే.. కాకాని గోవర్థన్ రెడ్డికి అవకాశం ఉంది. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి అవకాశం ఉంది. కర్నూలు గుమ్మనూరు జయరాంను మంత్రిగా తప్పిస్తే ఆయన స్థానంలో సాయి ప్రసాద్ రెడ్డికి అవకాశం ఉంటుందంటున్నారు.

నంద్యాల ప్రస్తుతం మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పిస్తే.. శిల్పా చక్రపాణిరెడ్డికి అవకాశం ఉంది అనంతపురం జిల్లాలో మంత్రి ఎవరూ లేకపోవటంతో ఉషశ్రీ చరణ్ కానీ జొన్నలగడ్డ పద్మావతికి కానీ అవకాశం ఉంది. శ్రీసత్యసాయి ప్రస్తుతం మాలగుండ్ల శంకరనారాయణ మంత్రిగా ఉన్నారు. ఆయన స్థానంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి కానీ తిప్పే స్వామికి కానీ అవకాశం ఉంది కడప ప్రస్తుతం మంత్రిగా ఉన్న అంజద్భాషా స్థానంలో కొత్తగా ఎన్నికైన డాక్టర్ సుధ కు అవకాశం ఉందంటున్నరు. అన్నమయ్య గడికోట శ్రీకాంతరెడ్డికి కానీ మేడా మల్లికార్జున్ రెడ్డిల్లో ఒకరికి అవకాశం ఉంది. శ్రీ బాలాజీ జిల్లా ప్రస్తుతం ఎవరూ మంత్రులు లేకపోవటంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డిల్లో ఒకరికి అవకాశం ఉంది. చిత్తూరు ప్రస్తుతం ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. నారాయణ స్వామిల్లో ఇద్దరిని కొనసాగిస్తే కొత్తవారికి అవకాశం లేదు. ఇద్దరిని తొలగిస్తే మాత్రం ఆర్కే రోజాకు అవకాశం ఎక్కువ ఉంది. జంగాలపల్లి శ్రీనివాసులు పేరు వినిపిస్తున్నా.. రెండో పక్షమేనని చెప్పాలి.