Begin typing your search above and press return to search.

5జీ స్పెక్ట‌మ్ ద‌క్కేది ఎవ‌రికి.. రేసులో అంబానీ, అదానీ!

By:  Tupaki Desk   |   26 July 2022 8:33 AM GMT
5జీ స్పెక్ట‌మ్ ద‌క్కేది ఎవ‌రికి.. రేసులో అంబానీ, అదానీ!
X
భవిష్యత్‌లో దేశంలో రాబోయే సాంకేతిక పరిజ్ఞానం.. 5జీ. 4జీతో పోల్చుకుంటే 5జీలో 10 రెట్ల వేగం ఉంటుంది. 4జీ కంటే కొన్ని రెట్ల వేగంతో ఇంటర్నెట్‌ పనిచేయ‌డం ఇందులో విశేషం. 4జీలో ఒక సినిమా డౌన్‌లోడ్‌ కావాలంటే కొన్ని నిమిషాలు పడితే.. 5జీలో క్ష‌ణాల్లోనే అల్ట్రా హెచ్‌డీ సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే వీఆర్‌, ఏఆర్‌ సాంకేతికతలో వేగం పెరగనుంది. భద్రతతో కూడిన రవాణా వ్యవస్థ, రిమోట్‌ ప్రాంతాలకు ఆరోగ్యసేవలు, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, సరకు రవాణాలో డిజిటల్‌ సేవలు వంటి ఎన్నో అంశాల్లో 5జీ కీలకం కానుంది.

ఈ నేప‌థ్యంలో 5జీ స్పెక్ట్ర‌మ్ వేలంలో బ‌డా సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయి ముకేష్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ తోపాటు భార‌తీ ఎయిర్‌టెల్, వోడాఫోన్లు వేలం కోసం బిడ్లు దాఖ‌లు చేశాయి. మ‌రోవైపు ప్ర‌పంచ కోటీశ్వ‌రుల్లో నాలుగో స్థానంలో ఉన్న గౌత‌మ్ అదానీ తానేమీ త‌క్కువ తిన‌లేద‌న్న‌ట్టు ఆయ‌న కూడా 5జీ కోసం రంగంలోకి దిగారు. తాజాగా వేలం ప్ర‌క్రియ జూలై 26న మంగ‌ళ‌వారం ప్రారంభం కావ‌డంతో ఈ 5జీ స్పెక్ట్ర‌మ్ ఎవ‌రికి ద‌క్కుతుంద‌నేదానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

ఆన్‌లైన్ ద్వారా 5జీ స్పెక్ట్రాన్ని ఆన్‌లైన్‌లో వేలం వేస్తున్నారు. వేలం వేయడానికి కేంద్ర మంత్రివర్గం జూన్ లో ఆమోదం తెలిపిన సంగ‌తి తెలిసిందే. 72097.85 మెగా హెర్ట్జ్ సామర్థ్యం గల స్పెక్ట్రమ్‌ 5జీని కేంద్రం అందుబాటులోకి తీసుకుని వచ్చింది. మొత్తం మూడు ఫ్రీక్వెన్సీల్లో ఆన్‌లైన్ వేలం పాట నిర్వ‌హిస్తున్నారు.

కాగా- టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) 5జీని అమలు చేయడానికి ఇప్ప‌టికే కొన్నిటిని పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, భోపాల్, బెంగళూరు మెట్రో, గుజరాత్‌లోని కాండ్లా పోర్ట్ ఇందులో ఉన్నాయి.

కాగా 5జీ కోసం ప్రస్తుతం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగా హెర్జ్‌ స్పెక్ట్రాన్ని వేలానికి ఉంచనున్నారు. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz , 26GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు వేలం నిర్వహిస్తున్నారు. 20 ఏళ్ల లీజు కాలానికి కేంద్ర ప్ర‌భుత్వం ఆయా కంపెనీల‌కు 5జీ స్పెక్ట్ర‌మ్ ను క‌ట్ట‌బెట్ట‌నుంది. దేశీయ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈ స్పెక్ట్రమ్‌ను ఆయా కంపెనీలకు వేలం ద్వారా కేటాయిస్తుంది. 20 ఏళ్ల‌ తర్వాత కంపెనీలు పొందిన స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది.