Begin typing your search above and press return to search.

విదేశీ టీకాలు దేశానికి ఎందుకు రావు? ఎవరిది పాపం?

By:  Tupaki Desk   |   16 April 2021 6:30 AM GMT
విదేశీ టీకాలు దేశానికి ఎందుకు రావు? ఎవరిది పాపం?
X
ఏడాది క్రితం ప్రపంచానికి సవాలుగా మారిన కోవిడ్ తాట తీసేందుకు పెద్ద ఎత్తున పరిశోధనలు మొదలయ్యాయి. ఏడాది చివరకు పలు సంస్థలు.. కరోనాకు కళ్లాలు వేసే వ్యాక్సిన్లు సిద్ధం చేశారు. అయితే.. దేశీయంగా వ్యాక్సిన్ల తయారీ మీద ఫోకస్ చేసిన ప్రభుత్వం.. విదేశాల నుంచి టీకాల్ని దిగుమతి చేసుకునే విషయానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పాలి. టీకా కార్యక్రమాన్ని జనవరిలో మొదలు పెట్టినా.. దేశీయంగా ఉత్పత్తి చేసే టీకాల్ని పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతులకు అనుమతులు ఇవ్వటంతో దేశీయంగా కొరతకు కారణమన్న విమర్శ వినిపిస్తోంది. దీనికి తోడు.. విదేశాల నుంచి వ్యాక్సిన్లను దిగుమతి చేసే విషయంలో జరిగిన జాగు కూడా.. తాజా పరిస్థితికి కారణమని చెప్పక తప్పదు.

దీంతో ఇరకాటంలో పడిన కేంద్రం.. మూడు రోజులుగా విదేశీ టీకాలకు అనుమతుల్ని వడివడిగా మంజూరు చేయటం గమనార్హం. మరింత కాలం ఎందుకు ఆలస్యం చేశారన్నది ప్రశ్నగా మారింది. కోవిడ్ ను సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉందని పరీక్షల్లో తేలిన ఫైజర్.. మొడెర్నాలు భారత్ కు మాత్రం రాలేదు. రాబోయే రోజుల్లో కూడా అంత తొందరగా వచ్చే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది.

దీనికి కారణం.. ఆయా వ్యాక్సిన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్. ఇప్పటికే పలు దేశాలు ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకోవటంతో.. మన దేశానికి వచ్చే వీల్లేదు. అంతేకాదు.. అత్యవసర వినియోగానికి అవసరమైన అనుమతులు ఇవ్వటంతో కేంద్రం ప్రదర్శించిన ఆలస్యం కూడా కారణంగా చెప్పాలి. ప్రపంచంలో కోవిడ్ కు చెక్ పెట్టే తొలి వ్యాక్సిన్ ను ఫైజర్ తయారు చేసింది. అనంతరం మొడెర్నా వ్యాక్సిన్ వచ్చింది. ఈ టీకాలు పశ్చిమ దేశాల్లో సమర్థంగా పని చేస్తున్నట్లు పలు పరీక్షల్లో తేలటంతో ఇప్పుడు దేశాలన్ని వాటి కోసం పోటీ పడుతున్నాయి.

క్షేత్ర స్థాయిలో ఫలితాలు ఎలా వస్తున్నాయన్న పరీక్షల్నిపక్కన పెట్టిన బ్రిటన్.. ఫ్రాన్స్ లాంటి దేశాలు.. అత్యవసర వినియోగానికి త్వరిగతిన క్లియరెన్సుల్ని ఇచ్చేశాయి. కానీ.. అలాంటి వేగాన్ని ప్రదర్శించకుండా ప్రొసీజర్ కారణంగా జరిగిన ఆలస్యం.. ఇప్పటికే ఇబ్బంది పెడుతోంది. సురక్షిత పరీక్షలు అవసరమే. కానీ.. కరోనా లాంటి మహమ్మారి విరుచుకుపడే వేళలో నిర్ణయాలు కనురెప్ప మాటున జరిగిపోవాలి.

అందుకు భిన్నంగా.. రూల్ బుక్ లో రూల్ ప్రకారం అన్ని జరుగుతూ పోవాలంటే.. అందుకు సామాన్య ప్రజలు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నదిమర్చిపోకూడదు. ఇప్పుడు దేశంలో అలాంటి పరిస్థితే నెలకొంది. వ్యాక్సిన్ విధానంలో మోడీ సర్కారు అనుసరించిన వైఖరి రానున్న రోజుల్లో ఇది మరిన్ని సమస్యలకు కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమువుతోంది. ఎవరెన్ని చెప్పినా.. వ్యాక్సిన్ల విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరించిన వ్యూహం ఫెయిల్ అయ్యిందని చెప్పక తప్పదు.