Begin typing your search above and press return to search.

వందే భారత్‌ ఇందుకింత వివాదంలో చుట్టుకుంది?

By:  Tupaki Desk   |   16 Jan 2023 7:30 AM GMT
వందే భారత్‌ ఇందుకింత వివాదంలో చుట్టుకుంది?
X
గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్‌ రైళ్లపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఆయా పట్టణాలు, నగరాల మధ్య ప్రయాణ దూరాన్ని అతి తక్కువ గంటల్లోనే అధిగమించే ఈ రైలుపై అంతా ఆసక్తి చూపుతున్నారు. ఈ వందే భారత్‌ రైళ్ల ప్రత్యేకతలపై భారీ ఎత్తున మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రజల్లోనూ చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో వందే భారత్‌ రైళ్లను కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం తమ ప్రచారానికి వాడుకుంటోంది. ప్రధాని మోడీ హయాంలోనే వందే భారత్‌ రైళ్లు సాకారమయ్యాయని బీజేపీ ఘనంగా చెప్పుకుంటోంది. దీనికి తగ్గట్టే ఈ రైళ్లను ప్రధాని మోడీ స్వయంగా ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఆయా రాష్ట్రాలకు వెళ్లి వందే భారత్‌ రైళ్లకు పచ్చ జెండా ఊపుతున్నారు.

మరోవైపు ఈ రైళ్లపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాజాగా వందే భారత్‌ రైలును సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య ప్రారంభించారు. వాస్తవానికి ఈ రైలును సికింద్రాబాద్‌– విజయవాడల మధ్య ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కోరిక మేరకు ఈ రైలును విశాఖ వరకు పొడిగించారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తెలంగాణ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. వందే భారత్‌ రైలు ఏదో మొదటిసారిగా ప్రారంభిస్తున్నట్టు ప్రధాని, గవర్నర్, కేంద్ర మంత్రులు హడావుడి చేశారని ఆయన విమర్శించారు. ఇప్పటికే 17 వందే భారత్‌ రైళ్లను దేశంలో ప్రారంభించారని ఇప్పుడు సికింద్రాబాద్‌ –విశాఖ మధ్య ప్రారంభించింది 18వ రైలు అని ఆయన గుర్తు చేశారు. ఇదేదో కొత్తగా ప్రారంభించినట్టు ఈ ఆర్భాటాలు ఎందుకని ఆయన బీజేపీ నేతలను నిలదీశారు.

అలాగే వందే భారత్‌ రైలులో కనీస చార్జి రూ.1600 ఉందని.. ఇంత చార్జీతో పేదలు, మధ్యతరగతి వర్గాలు ప్రయాణించలేవని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వందే భారత్‌ రైలును మధ్యతరగతి వర్గాలు, పేదలకు అందుబాటులోకి తీసుకురాకపోవడం దారుణమని తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తున్నాయి. ఈ వందే భారత్‌ రైళ్లు కేవలం ధనికులకు మాత్రమే ఉపయోగపడతాయిని అంటున్నారు.

మరోవైపు దేశంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉండగా.. వాటిని పరిష్కరించకుండా.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అంటూ హడావుడి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలను బీజేపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఆవిష్కరణలు అంటూ హడావుడి చేయడం తప్ప ప్రయోజనం ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.