Begin typing your search above and press return to search.

ఇక రాజ‌ధాని అమ‌రావ‌తి మునిసిపాలిటీగా మారిపోనుందా?

By:  Tupaki Desk   |   9 Sep 2022 9:31 AM GMT
ఇక రాజ‌ధాని అమ‌రావ‌తి మునిసిపాలిటీగా మారిపోనుందా?
X
ఏపీ రాజ‌కీయాలు వ‌ర్షాకాలంలోనూ హీటెక్కాయి. ఓవైపు అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు.. అమ‌రావ‌తి నుంచి అర‌స‌వెల్లి వ‌ర‌కు పేరుతో మ‌హాపాద‌యాత్ర‌-2కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వారికి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. రాజ‌ధాని ప‌రిధిలోని 22 పంచాయ‌తీల‌తో అమ‌రావ‌తి మునిసిపాలిటీని ఏర్పాటు చేసే ప్ర‌తిపాద‌న‌ను తెచ్చింది. దీనిపై ఆయా గ్రామాల ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం వ్యక్త‌మ‌వుతోంద‌ని ఒక అగ్ర‌ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌చురించింది

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌రిధిలోని 19 గ్రామాల‌ను కార్పొరేష‌న్ గా ఏర్పాటు చేయ‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింది. అయితే ఇందుకు ఆయా గ్రామ పంచాయ‌తీల గ్రామ స‌భ‌ల అనుమ‌తి కావాల్సి ఉండ‌టంతో గ్రామ స‌భ‌లు నిర్వ‌హించింది. ఈ గ్రామ స‌భ‌ల్లో ప్ర‌జ‌లు 19 గ్రామాల‌తో కార్పొరేష‌న్ ఏర్పాటును ముక్త కంఠంతో తిర‌స్క‌రించారు. మొత్తం రాజ‌ధాని ప‌రిధిలోని 29 పంచాయ‌తీల‌తో కార్పొరేష‌న్ ఏర్పాటు చేయాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. దీంతో ప్ర‌భుత్వం అప్ప‌ట్లో కార్పొరేష‌న్ ప్ర‌తిపాద‌న‌పై నెమ్మ‌దించింది.

మ‌ళ్లీ ఇప్పుడు రాజధాని రైతులు మ‌హాపాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో అమ‌రావ‌తి మునిసిపాలిటీని ఏర్పాటు చేస్తామంటూ ముందుకొస్తోంది. ఈ క్ర‌మంలో రాజ‌ధాని పరిధిలో ఉన్న‌ తుళ్లూరు మండలంలోని 19, మంగళగిరి మండలంలోని 3 పంచాయతీలతో కలిపి అమరావతిని మునిసిపాలిటీగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేర‌కు రాష్ట్ర‌ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీంతో ఈ 21 పంచాయతీల్లో గ్రామసభల నిర్వహణకు గుంటూరు కలెక్టర్‌ చర్యలు చేపట్టారు. పది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్ర‌భుత్వం స్థానిక అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆయా గ్రామ పంచాయతీల‌ కార్యదర్శులకు వెంటనే ఉత్త‌ర్వులు ఇచ్చి గ్రామ స‌భ‌ల స‌మావేశాల‌కు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

అమ‌రావ‌తి రాజ‌ధాని గ్రామాల‌ను మునిసిపాలిటీగా ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై రైతులు మండిప‌డుతున్నారు. రాజ‌ధానిని విచ్ఛిన్నం చేయ‌డానికి మొద‌టి నుంచి ప్ర‌భుత్వం అనేక ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంద‌ని గుర్తు చేస్తున్నారు. మ‌హాపాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్న త‌మ నైతిక స్థైర్యాన్ని దెబ్బ‌తీయ‌డానికే ఇప్ప‌టికిప్పుడు అమ‌రావ‌తి మునిసిపాలిటీని ఏర్పాటు చేస్తోంద‌ని నిప్పులు చెరుగుతున్నారు.

రైతులంతా పాదయాత్రకు సిద్ద‌మ‌వుతున్న త‌రుణంలో అమరావతి మునిసిపాలిటీ ఏర్పాటు ప్రతిపాదనను తీసుకురావడం ప‌ట్ల ధ్వ‌జ‌మెత్తుతున్నారు. గ్రామాల్లో ప్రజలు అందుబాటులో లేని సమయంలోనే సభలు నిర్వహించి ఉన్న కొద్దిమందితో ఈ ప్రతిపాదనను ఆమోదింపజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమ‌నే ఆరోప‌ణ‌లు రైతుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.