Begin typing your search above and press return to search.

వార్ కానీ వస్తే పాక్ నాలుగు ముక్కలంట

By:  Tupaki Desk   |   7 Sept 2015 5:37 PM IST
వార్ కానీ వస్తే పాక్ నాలుగు ముక్కలంట
X
ఓపక్క సరిహద్దుల్లోని ఉద్రిక్తత సాగుతుంటే.. మరోవైపు రెండు దేశాలకు చెందిన రాజకీయ.. సైనికాధికారుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తమతో యుద్ధం వస్తే.. భారత్ కు మర్చిపోలేని చేదు అనుభవాన్ని రుచి చూపిస్తామంటూ ఓ పక్క పాక్ సైనికాధికారులు మాటలు పేలుతుంటే.. మరోవైపు భారత్ తరఫు ఆచితూచి వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించటంతో పాటు.. వాతావరణాన్ని మరింత హాట్ హాట్ గా తయారు చేసేటట్లు కనిపిస్తోంది.

సరిహద్దుల్లో పాకిస్థాన్ చేస్తున్న దుశ్చర్యల్ని తీవ్రంగా ఖండించిన సుబ్రమణ్యస్వామి.. పాక్ తో ఈసారి యుద్ధమే వస్తే.. ఆ దేశాన్ని నాలుగు ముక్కలు చేసేస్తామని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో రెండు ముక్కలు చేశామని.. ఈసారి కానీ యుద్ధమే వస్తే.. నాలుగు ముక్కలు గ్యారెంటీ అని వార్నింగ్ ఇస్తూ వ్యాఖ్యలు చేశారు.

భారత్ యుద్ధం కోరుకోవటం లేదని.. అందుకే సంయమనం పాటిస్తున్నామని చెప్పిన ఆయన.. భారత్ ను పాక్ ఎదుర్కొనలేదని.. అయినప్పటికీ యుద్ధం కాని చోటు చేసుకుంటే మాత్రం పాక్ కు తగిన బుద్ధి చెప్పటం ఖాయమంటున్నారు. పాక్ కు ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా చేసిన వ్యాఖ్యలు పాక్ కు మంట పుట్టించటం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. మరి.. పాక్ ఎలా స్పందిస్తుందో..?