Begin typing your search above and press return to search.

9 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ జోడో యాత్ర ప్రభావం చూపేనా?

By:  Tupaki Desk   |   20 Jan 2023 1:30 PM GMT
9 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ జోడో యాత్ర ప్రభావం చూపేనా?
X
2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన ఎన్డీయే హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అటు ఈసారి బీజేపీయేతర శక్తులన్నింటిని కూడగట్టుకొని కాంగ్రెస్ పాగా వేయాలని చూస్తోంది. అయితే అంతకంటే ముందే 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో తమకు అనుకూల పవనాలు వీస్తే వాటిని సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని ఇరు పార్టీలు చూస్తున్నాయి. ఇక జోడో యాత్రతో దేశమంతా తిరుగుతున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపే దిశగా ముందుకెళ్తోంది. అయితే ప్రతీ రాష్ట్రంలో ఏదో విధంగా కాషాయ జెండా ఎగురవేయాలని చూస్తున్న కమలనాథులను ఓడించేందుకు జోడోయాత్ర ఫలితాన్నిస్తుందా..?

ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం మినహా మేఘాలాండ్, నాగాలాండ్, త్రిపురల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. గతంలో మిజోరాంలో కాంగ్రెస్ కు పట్టు ఉండేది. కానీ రాను రాను ఓటు శాతం కోల్పోతుంది. బీజేపీ వేసే స్కెచ్ కు కాంగ్రెస్ తట్టుకోలేకపోతోంది. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. దీనిని అవకాశంగా తీసుకొని కమలనాథులు ప్రభుత్వాన్నికూలగొట్టి కాషాయ జెండా ఎగురవేసుకుంటున్నారు. ఇక త్రిపురలో పెనవేసుకున్న కమ్యూనిస్టులను ఓడించారు కాషాయ పార్టీ నాయకులు.

సార్వత్రిక ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ సమాన సీట్లు సాధించింది. దీంతో జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ బీజేపీ వేసిన స్కెచ్ తో 2019లో అధికారం బీజేపీ చేతిలోకి వెళ్లింది. బీజేపీ నాయకుడు యడ్యూరప్పతోనే ఇక్కడ పార్టీ పట్టు సాధించింది. కానీ ఆయన రిటైర్మెంట్ ప్రకటించడంతో తరువాత పార్టీని ఎవరు లాక్కోస్తారో తెలియాలి.

ఇక కాంగ్రెస్ నిర్వహిస్తోన్న జోడో యాత్ర కర్ణాటకలో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ నిర్వహించి ఈ యాత్ర ఈ రాష్ట్రంలో ఎక్కువ రోజులు సాగింది. అంతేకాకుండా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కర్ణాటకకు చెందిన వారే. అటు కాంగ్రెస్ నేత సిద్ధారామయ్యకు ప్రజల్లో ఆదరణ ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారు. రాహుల్ గాంధీ నిర్వహించి జోడో యాత్రలు రాష్ట్రంలో ఉన్న సమస్యలు లేవనెత్తారు. సామాన్యుల నుంచి పారిశ్రామిక వేత్తలను కలిశారు. రాష్ట్రంలో ప్రధానంగా ఉండే సమస్యల గురించి తెలుసుకున్నారు. వీటిని వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. దక్షిణాదిక చెందిన తెలంగాణలో నూ కాంగ్రెస్ జోడోయాత్ర సాగింది. అయితే ఇక్కడి పార్టీలో నెలకొన్న అసంతృప్తి దెబ్బతీస్తోంది. సొంత పార్టీ నాయకులే ఆరోపణలు చేస్తుండడంతో ఆ పార్టీని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో బీజేపీ బలపడుతోంది.

ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు కాంగ్రెస్ కు కీలకంగా మారాయి. ఇక్కడ పోటా పోటీ నెలకొంది. ఛత్తీస్ గఢ్, రాజస్ఠాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరోసారి అధికారం కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. మధ్యప్రదేశ్ లోనూ కాంగ్రెస్ కు సీట్లు బాగానేవచ్చాయి. అయితే రాహుల్ గాంధీ చేపడుతున్న జోడోయాత్ర ఈ రాష్ట్రాల్లోకి రాలేదు. ఒకవేళ ఆయన ఈ రాష్ట్రాల వైపు చూస్తే మరింత ఫలితం ఉంటుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ప్రస్తుతం ఆయన జోడో యాత్ర కాశ్మీర్ లోయలో సాగుతోంది. మరి అక్కడి నుంచి ఇక్కడిక వస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.