Begin typing your search above and press return to search.

రాహుల్, సచిన్ రాజీనామాతో రాజస్థాన్ సంక్షోభం..

By:  Tupaki Desk   |   29 May 2019 7:47 AM GMT
రాహుల్, సచిన్ రాజీనామాతో రాజస్థాన్ సంక్షోభం..
X
కాంగ్రెస్ ఓటమితో దేశంలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ లో మొన్నటి డిసెంబర్లోనే విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చిన్నాభిన్నం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ రాజీనామా గనుక చేస్తే.. రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలెట్ కూడా ఆయన బాటలో నడుస్తారని సమాచారం. రాజస్థాన్ ఓటమితో ఈయన కూడా నిరాశలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే బీజేపీలో చేరుతారా అన్న టెన్షన్ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తోంది.

సచిన్ పైలెట్.. రాహుల్ గాంధీకి చాలా దగ్గర. మొన్నటి రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ముందుండి నడిపించిన సచిన్ పైలెట్ కే సీఎం అని అంతా భావించగా సీనియర్ అయిన అశోక్ గెహ్లాట్ కు రాజస్థాన్ సీఎం పదవి వరించింది. దీనిపై తీవ్ర నిరాశ చెందిన సచిన్ పైలెట్ డిప్యూటీ సీఎం పదవితోనే సరిపెట్టుకున్నారు.

అయితే రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే సచిన్ పైలెట్ కూడా పీసీసీ చీఫ్ పదవికి, డిప్యూటీ సీఎం పదవి పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో 100 కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు 73మంది ఉన్నారు. బీఎస్పీ ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోంది.

ఇప్పుడు సచిన్ పైలెట్ కాంగ్రెస్ రాజీనామా చేస్తే ఆయన సానుభూతి ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదంలో పడుతుంది. ఒకవేళ బీజేపీ గాలం వేసి సచిన్ పైలెట్ ను లాగేసి 73మంది ఎమ్మెల్యేలతోపాటు సచిన్ వెంట వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇలా సచిన్ పైలెట్ తో రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ యోచిస్తోంది. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ రాజీనామా వెనక్కి తీసుకుంటే ఈ పరిణామాలు మారే అవకాశాలుంటాయి. దీంతో రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలంటే ముందు రాహుల్ రాజీనామా ఉపసంహరించుకోవాలి.. దాని తర్వాత సచిన్ రాజీనామాపై వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. ఇదంతా జరిగితే రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగే అవకాశాలుంటాయి.