Begin typing your search above and press return to search.

విన్‌స్టన్ చర్చిల్....వింటున్నావా...చూస్తున్నావా... ?

By:  Tupaki Desk   |   25 Oct 2022 5:47 AM GMT
విన్‌స్టన్ చర్చిల్....వింటున్నావా...చూస్తున్నావా... ?
X
ఎక్కడ ఏ లోకాన ఉన్నాడో కానీ బ్రిటన్ దేశీయుడు,నాటి యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ వింటూనే ఉంటాడు. చూస్తూనే ఉంటాడు. రవి అస్తమించని ఒకనాటి బ్రిటిష్ సామ్రాజ్యం కాస్తా ఇప్పటి బ్రిటన్ దేశంగా మారిన నేపధ్యంలో భారత సంతతికి చెందిన వారొకరు బ్రిటన్ ప్రధాని అవుతారన్నది కలలో కూడా ఊహించని విన్‌స్టన్ చర్చిల్ ఇపుడు అనివార్యంగా ఎక్కడ నుంచి అయినా అంతా చూస్తూనే ఉంటాడు మరి. అసలు విన్‌స్టన్ చర్చిల్ గురించి ఇక్కడ ఎందుకు చెప్పుకోవాలి అంటే ఆయన ఈ దేశానికి స్వాతంత్రం వస్తుంది అనగా 1947 ప్రాంతంలో అసలు భారతీయులకు స్వాతంత్రం అవసరమా అన్నట్లుగా మాట్లాడారని చరిత్ర చెబుతోంది.

అంతే కాదు భారతీయుల చేతికి దేశాన్ని అప్పగిస్తే పాలించుకోగలరా అన్న ధర్మ సందేహాన్ని కూడా ఇదే విన్‌స్టన్ చర్చిల్ వ్యక్తం చేశారు. అంటే భారతీయుల సామర్ధ్యం విషయంలో విన్‌స్టన్ చర్చిల్ కి అంత తేలిక భావనలు ఉన్నాయనుకోవాలి. భారతీయులకు ఏం తెలుసు. వారు పాలించబడేవారే కానీ పాలితులు కానే కారని గట్టి భావనతో విన్‌స్టన్ చర్చిల్ లాంటి వారు చాలా మంది బ్రిటిష్ పాలకులు ఆనాడు ఉన్నారు.

ఏకంగా రెండు వందల ఏళ్ళ పాటు భారత్ ని పాలించి తమ కట్టు బానిసగా చేసుకోవాలని చూశారు. కానీ వారిని ఆది నుంచి ప్రతిఘటిస్తూ వచ్చిన అమర వీరులు ఎందరో ఉన్నారు. ఈ దేశమాత దాస్య శృంఖలాలను బద్ధలు కొట్టే క్రమంలో ఎందరో తమ అసులువు వీడారు. అలా భారతీయులు తమ దేశాన్ని సాధించుకున్నారు.

ఈ రోజు ఏడున్నర దశాబ్దాల స్వాతంత్రాన్ని భారత్ అనుభవిస్తోంది. ప్రపంచ పటంలో తనకంటూ విశిష్ట స్థానాన్ని భారత్ సాధించింది. విశ్వ గురువుగా శాంతి దేశంగా పేరు తెచ్చుకుంది. అంతే కాదు కష్టకాలంలో అగ్ర రాజ్యాల మధ్య సంధాన కర్తగా వారధిగా ఉంటూ అందరి బంధువుగా పేరు తెచ్చుకుంది.

అతి తొందరలో అభివృద్ధి చెందిన దేశంగా కూడా భారత్ మారనుంది. ఈ రోజు భారత్ అంటే ఈ ప్రపంచానికి ఒక అర్ధాన్ని పరమార్ధాన్ని చెబుతూ తనను తాను రుజువు చేసుకుంటూ సాగుతున్న పయనంలో అతి పెద్ద మలుపు ఒకటిగా చెప్పాలంటీ రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడం.

ఏ భారతీయులను అయితే ఏమీ చేతకానివారు, వారిని వారు పాలించుకోలేరు అంటూ చర్చిల్ లాంటి వారు ఏహ్య భావాన్ని ప్రదర్శించేలా మాట్లాడారో దానికి ఇన్నేళ్ళ తరువాత రిషి సునాక్ రూపంలో భారత్ తగిన జవాబు ఇచ్చిందనుకోవాలి. భారత్ నుంచి బ్రిటన్ లో సెటిల్ అయిన పంజాబ్ జంటలు పుట్టిన రిషి సునాక్ ఈ రోజు బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఒక సారధిగా పగ్గాలు అందుకుంటున్నారు అంటే చర్చిల్ ఏ లోకంలో ఉన్నా ఈ వింతను విని తీరాల్సిందే. కనులారా చూడాల్సిందే.

అదే టైం లో ఈ దేశం కోసం తన తనువులు త్యాగం చేసిన అమరులు కూడా ఏ లేకంలో ఉన్నా ఈ అద్భుతాన్ని వీక్షించి భారత్ పుత్రులుగా తమ శ్రమ పరిశ్రమ నేటికి పండాయని నిండుగా ఆనందభాష్పాలు కార్చే అరుదైన సందర్భం కూడా ఇదే అవుతుంది అన్నది నిస్సందేహం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.