Begin typing your search above and press return to search.

వ‌చ్చేస్తోంది శీతాకాలం.. జ‌లుబు, ఫ్లూ బారిన ప‌డ‌కుండా ఇలా చేయండి!

By:  Tupaki Desk   |   15 Oct 2022 5:30 AM GMT
వ‌చ్చేస్తోంది శీతాకాలం.. జ‌లుబు, ఫ్లూ బారిన ప‌డ‌కుండా ఇలా చేయండి!
X
ఓవైపు వ‌ర్షాకాలం చివ‌ర‌లో ఉంది.. మ‌రోవైపు అప్పుడే కొన్ని ప్రాంతాల్లో చ‌లిపులి కూడా మొద‌ల‌యిపోయింది. ఈ నేప‌థ్యంలో జ‌లుబు, ఫ్లూలు ప్ర‌జ‌ల‌ను వేధిస్తున్నాయి. ఉష్ణోగ్ర‌తలు పూర్తిగా ప‌డిపోయాయి. గ‌త కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లో భారీ వ‌ర్షాలు దుమ్ములేపుతున్నాయి. మ‌రోవైపు అప్పుడు కొన్ని చోట్ల మంచు కురుస్తోంది.. శీత‌ల గాలులు వీస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌లుబు, ఫ్లూ బారిన‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా క‌రోనా పూర్తిగా పోలేదు. జ‌లుబు, ఫ్లూ ఉంటే అనేక ఇన్‌పెక్ష‌న్స్ కూడా దాడి చేసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

జలుబు, జ్వరం, దగ్గు లేదా ఫ్లూ బారిన పడకుండా ఉండాలంటే రోజంతా ఎక్కువ నీరు తాగాలి. అది కూడా కాచి చ‌ల్లార్చిన నీటిని తాగితే నీటిలో ఉండే బ్యాక్టీరియా, సూక్ష్మ‌జీవులు న‌శిస్తాయి. వేడి చ‌ల్లార‌కుండా ఫ్లాస్కులో నీటిని పోసుకుని తాగ‌డం ఉత్త‌మం. అదేవిధంగా ఒంటిలో వేడిని పెంచే వెల్లుల్లిని వంట‌ల్లో విరివిగా వినియోగించండి. వెల్లుల్లిలో బ్యాక్టీరియా పెరుగుద‌ల‌ను కూడా నిర్మూలించే గుణాలు ఉన్నాయి.

వ‌ర్షాకాలంలో దాదాపు ఎక్కువ‌మంది జ్వ‌రం, జ‌లుబు, ఫ్లూ, అతిసార (వాంతులు, విరోచ‌నాలు)ల బారిన‌ప‌డే ప్ర‌మాద‌ముంది. అందువ‌ల్ల విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఆహారంలో పుట్టగొడుగులు, నిమ్మ, తేనె వంటివి ఉండాలి. జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని స్వీక‌రించాలి. రెడ్ మీట్, గుడ్లు, పెరుగు, తృణధాన్యాలు కూడా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ఇక వ‌ర్షాకాలం, చ‌లికాలంలో సూప్‌లు చేసే మేలు అంతా ఇంతా కాదు. త‌ర‌చూ వివిధ ర‌కాల సూప్‌ల‌ను టీ, కాఫీల్లా తీసుకోండి.

ఈ వ‌ర్షా, చ‌లికాలాల్లో చ‌ల్ల‌బ‌డిన ఆహారాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తీసుకోవ‌ద్దు. వేడి వేడిగా ఉండే వాటినే తినండి. దాహం వేసిన‌ప్పుడ‌ల్లా గోరు వెచ్చ‌ని నీటిని తాగుతూ ఉండండి. రోజూ రాత్రి పడుకునేముందు ప‌సుపు క‌లిపిన పాల‌ను తాగండి. ఒక అల్లం ముక్క‌పై కొంచెం ఉప్పు చ‌ల్లుకుని దాన్ని తినండి. ఇలా చేస్తే సైన‌స్‌, గొంతులో శ్లేష్మం త‌గ్గిపోతుంది. ఊపిరాడ‌ని ప‌రిస్థితి, బాగా ముక్కు దిబ్బ‌డ ఉంటే ఆవిరి మెషిన్ ద్వారా బాగా ఆవిరి ప‌ట్టించండి.

జ‌లుబు, ముక్క‌దిబ్బ‌డ‌ను త‌గ్గించ‌డానికి మ‌రిగించిన వేడి నీళ్ల‌లో కొన్ని పుదీనా ఆకులు, వాము, క‌ర్పూరం వంటివి కలిపి ఆవిరి ప‌ట్టాలి. దీంతో దగ్గు, గొంతు నొప్పి సమస్యలు తగ్గుతాయి. పెద్దలతోపాటు ఆరేళ్ళు దాటిన పిల్లలకు సైతం ఇలా ఆవిరి ప‌ట్టొచ్చు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.