Begin typing your search above and press return to search.

నిర్భయకు న్యాయం కోసం ఏడేళ్ల పోరాటం..ఆ మహిళా లాయర్ ఎవరంటే ?

By:  Tupaki Desk   |   20 March 2020 4:30 PM GMT
నిర్భయకు న్యాయం కోసం ఏడేళ్ల పోరాటం..ఆ మహిళా లాయర్ ఎవరంటే ?
X
దేశ రాజధానిలోనిర్భయపై అత్యంత క్రూరంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు దోషులు ఎట్టకేలకు ఉరికంబాన్ని ఎక్కారు. ఈ కేసులో దోషులు అయిన నలుగురికి ఉరిశిక్షను శుక్రవారం తెల్లవారు జామున అమలు చేశారు. న్యూఢిల్లీలోని షహీద్ భగత్‌ సింగ్ మార్గ్‌ లో గల తీహార్ కేంద్ర కారాగారంలో ఈ నలుగురినీ ఏకకాలంలో ఉరి తీశారు. ఈ సందర్భంలో ఈ కేసు విషయంలో నిర్భయ కుటుంబానికి మొదటి నుండి అండగా ఉంటూ, వారి తరఫున న్యాయస్థానాల్లో పోరాడిన మహిళా న్యాయవాది పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది.

నిర్భయ ఘటన జరిగినప్పటి నుండి ఇప్పటి వరకూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, నిర్భయ కి న్యాయం జరిగేలా అనుక్షణం పరితపిస్తూ కేసును కొలిక్కి తెచ్చారు. ఎంతో అనుభవం ఉన్న నిర్భయ దోషుల తరుపు లాయర్ ఏపీ సింగ్‌ను ధీటుగా ఎదుర్కొని పోరాట యోధురాలిగా నిలిచారు. ఆమె ఎవరో కాదు సీమా ఖుష్వాహా. చట్టంలో ఉన్నట్లుగా చెబుతోన్న లొసుగులను అడ్డుగా పెట్టుకుని తమ చావును కూడా ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చిన దోషులకు ఉరికంబం ఎక్కేంత వరకూ ఈ యువ లాయర్ వారిని విడిచిపెట్టలేదు.

ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం, దోషులపై ఛార్జిషీట్ నమోదు చేయించడం మొదలుకుని ఈ కేసుకు సంబంధించిన ప్రతి విషయంలోనూ సీమా ఖుష్వాహ ముద్ర అడుగడుగునా కనిపిస్తుంది. పటియాలా హౌస్ న్యాయస్థానం - ఢిల్లీ హైకోర్టు - సుప్రీంకోర్టులో ఈ కేసు మీద ఆమె ఆశాదేవి తరఫున వాదనలను సమర్థవంతంగా వినిపించారు. కేసును తప్పుదారి పట్టించడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఏ మాత్రం బెరుకు లేకుండా నిర్భయ తల్లికి అండగా నిలిచారు. ఇంత చేసినా.. ఆమె ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదు. కేవలం తన స్నేహితురాలికి సాయం చేసినట్టుగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు.

ఉత్తర ప్రదేశ్‌ కు చెందిన సీమా ఖుష్వాహా అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్‌ సభ్యురాలు. అయినప్పటికీ.. ఈ కేసులో సుప్రీంకోర్టు వరకూ వెళ్లగలిగారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి దోషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. తమ మరణాన్ని ఆలస్యం చేసుకోగలరు తప్ప.. తప్పించుకోలేరని సీమా ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. చివరికి ఆమె చెప్పిందే నిజం అయ్యింది. దీనిపై ఆమె మాట్లాడుతూ .. చట్టంలో ఉన్న లోపాలేమిటో కూడా తాను అనుభవపూరకంగా తెలుసుకోగలిగానని , చట్టంలో లోపాలు ఉండటం వల్లే వారు మూడుసార్లు డెత్ వారెంట్ల నుంచి తప్పించుకోగలిగారని అభిప్రాయపడ్డారు. నిర్భయకు, ఆమె కుటంబానికి న్యాయం అందించానని సంతృప్తి తనకు మిగిలిందని అన్నారు. ఈ ఏడేళ్ల కాలంలో ఆశాదేవి కుటుంబంతో తనకు సన్నిహితం ఏర్పడిందని, ఆమె తనను కన్న కుమార్తెగా చూసుకున్నారని సీమా సంతోషాన్ని వ్యక్తం చేసారు. అయితే , ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. సీమాకు ఇదే మొదటి కేసు. ఆమె వాదించిన తొలి కేసులోనే విజయం సాధించారు. దేశంలోనే సంచలనమైన కేసు అయినప్పటికీ బలంగా తన వాదనలు వినిపించారు. తాను ఒక ఆడబిడ్డగా, న్యాయ విద్య చదవినందుకు న్యాయం చేయాలనే దృఢమైన సంకల్పంతో ముందుకు అడుగులు వేసినట్టు ఆమె చెప్పారు. ఈ విషయం తెలిసిన వారంతా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.