Begin typing your search above and press return to search.

రైల్లో పోలీస్ బాస్ ను కొట్టేసిన దొంగలు

By:  Tupaki Desk   |   13 Sep 2015 4:39 AM GMT
రైల్లో పోలీస్ బాస్ ను కొట్టేసిన దొంగలు
X
ఆమె సాదాసీదా అధికారిణి కాదు. భావి పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చే సంస్థలో కీలక పదవిలో ఉన్న ఐపీఎస్ అధికారిణి. అలాంటి ఆమెపై చేయి చేసుకోవటమే కాదు.. ఆమెపై తీవ్రంగా దాడి చేసి.. డబ్బు.. బంగారం లాంటి విలువైన వస్తువుల్ని దోచుకెళ్లటం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

రైళ్లల్లో భద్రత ఎంత మేర ఉందన్నది తాజా ఘటన చెప్పకనే చెప్పేస్తుంది. అప్పా (ఏపీ పోలీస్ అకాడమీ)లో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న నాన్ ఐపీఎస్ క్యాడర్ అయిన మహిళా ఐపీఎస్ అధికారిణి రత్న పై దాడి జరిగింది.

చెన్నై వెళ్లాల్సిన ఆమె.. అందులో భాగంగా సింహపురి రైలు ఎక్కారు. సికింద్రాబాద్ లో ఆమె వికలాంగుల బోగీలో ఎక్కారు. ఆమెను గమనిస్తు వచ్చిన దోపిడీ దొంగలు.. మునుబోలు ప్రాంతంలోఆమెపై ఒక్కసారిగా దాడి చేశారు. ఊహించని పరిణామానికి ఆమె తొలుత కొంత ప్రతిఘటించినా.. తర్వాత తగ్గారు. చున్నీతో చేతులు కట్టి బంగారు ఉంగరాలు.. గాజులు.. మెడలో గొలుసు లాక్కున్నారు. ఈ సందర్భంగా ఆమెకు గాయాలయ్యాయి.

ఆమెను ఎంత దారుణంగా హింసించారంటే.. చేతి మధ్యలో రూపాయి నాణెన్ని పెట్టుకొని.. పిడికిలి బిగించి ముఖం మీద దెబ్బలు కొట్టటంతో ఆమె ముఖం వాచిపోయింది. నోట మాట రాని దుస్థితి. ఇదిలా ఉంటే.. ఇంత జరుగుతున్నా.. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది స్పందించకపోవటం. వారంతా సీటు కోసం జరుగుతున్న గొడవగా భావించారే కానీ.. దాడిగా అనుకోలేదన్న మాటపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు.. ఆమె పెద్ద ఎత్తున కేకలు వేసినా పోలీసుసిబ్బంది లేదని ఆమె చెబుతున్నారు. ప్రమాద సమయంలో చైనులాగిగే రైలు ఆగుతుందన్న దానికి భిన్నంగా.. ఆమె చైను లాగినా రైలు ఆగలేదు. దొంగల దాడితో ఆమె వద్దనున్న బంగారు.. నగదును దోచుకెళ్లారు. దొంగలు తనపై చేసిన దాడి గురించి రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆమెకు చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. ఒక ఐపీఎస్ హోదా ఉన్న అధికారిణి విషయంలోనే రక్షణ ఇలా ఉంటే సామాన్యుల సంగతేంది?