Begin typing your search above and press return to search.

మహిళా క్రికెటర్లకు పండగే.. పురుషులతో సమానంగా డబ్బు

By:  Tupaki Desk   |   27 Oct 2022 4:30 PM GMT
మహిళా క్రికెటర్లకు పండగే.. పురుషులతో సమానంగా డబ్బు
X
భారత్ లో మహిళల క్రికెట్ వేగంగా ఎదుగుతోంది. ప్రపంచ స్థాయి జట్టుగా తనదైన ముద్ర వేస్తోంది. భారీ మార్కెట్ ఉన్నచోట ఆదరణ చూరగొంటోంది. కుర్రది షెఫాలీ వర్మ.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. దూకుడైన స్మ్రతి మంధాన.. తాజా పేస్ గుర్రం రేణుకా సింగ్.. భారత మహిళల జట్టును అగ్ర శ్రేణిలో నిలపడానికి పట్టుదలగా శ్రమిస్తున్నారు. దిగ్గజాలు హైదరాబాదీ మిథాలీ రాజ్, బెంగాలీ పేసర్ జులన్ గోస్వామి రిటైరైనా.. ఆ లోటు కనిపించకుండా ప్రస్తుత జట్టు సభ్యులు రాణిస్తున్నారు. అయితే, ఇంతగా పేరు సంపాదిస్తున్నా ఆటలో వారి సంపాదన తక్కువే.

ప్రకటనల ఆదాయం లేకుంటే..

మిథాలీ రాజ్, జులన్, హర్మన్, స్ర్మతి తదితరులు ఒకటీ అరా అడ్వర్టైజ్ మెంట్లు చేస్తూ వ్యక్తిగతంగా ఆదాయ సముపార్జనలో ఉన్నారు. అయితే, మిగతా అందరికీ ఇదే స్థాయిలో సంపాదన ఉందా అంటే చెప్పలేం. ముఖ్యంగా జూనియర్ స్థాయిలో మహిళా క్రికెటర్లకు ఆర్థిక ప్రోత్సాహం తక్కువే. రంజీల్లో ఆడినప్పటికీ.. కనీసం ప్రైవేటు ఉద్యోగం దక్కుతుందన్న ఆశ కూడా లేని పరిస్థితి. మహిళా క్రికెట్ మరింతగా ఎదగాలంటే వారికి ఆర్థిక భరోసా అవసరం. అయితే, ఇప్పటివరకు పురుషులు, మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు, బీసీసీఐ కాంట్రాక్టుల్లో పూర్తి వ్యత్యాసం ఉండేది. తాజాగా పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు ఇవ్వాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.

వేతనాలు సమం..

పురుషులతో పోలిస్తే మహిళా క్రికెట్ లో వేగం లేకపోవచ్చు. మెరుపులు తక్కువ కావొచ్చు. కానీ, గతం కంటే పురోగతి ఉందని చెప్పగలం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ మహిళా జట్లను చూస్తే ఈ విషయం తెలిసిపోతుంటుంది. అందుకని భారత మహిళా క్రికెట్‌ జట్టు ఎదుగుదలను కాంక్షిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఎప్పటినుంచో ఉన్న సమాన వేతనాల డిమాండ్ ను అమలు చేయనుంది. మ్యాచులకు సంబంధించి పురుష ఆటగాళ్లతో సమానంగా మహిళలకు వేతనాలను అందించనున్నట్టుగా తెలిపింది. బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ మేరకు ట్వీట్ చేశారు.

వివక్ష తొలగినట్లే

తాజాగా తీసుకున్న నిర్ణయంతో క్రికెట్ లో పురుషులు-మహిళల వివక్ష తొలగినట్లేనని జై షా తెలిపారు. ఇలాంటి నిర్ణయం సంతోషకరమని వివరించారు. భారత క్రికెట్‌లో సమానత్వం అనే కొత్త శకానికి మేం నాంది పలకనున్నాం. పురుష ఆటగాళ్లు అందుకునే వేతనాన్నే ఇకపై బీసీసీఐ మహిళా క్రికెటర్లు సైతం పొందనున్నారు' అని పేర్కొన్నారు.

ఈ క్రమంలో పురుషుల జట్టుకు ఎంత మ్యాచ్ ఫీజు ఉన్నదీ.. మహిళల జట్టుకు ఎంత రానున్నదీ వివరించారు. కాగా, 2020 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత అమ్మాయిలు.. బర్మింగ్‌హామ్‌ కామన్‌వెల్త్‌ క్రీడల్లో రజత పతకంతో మెరిశారు. ఈ నేపథ్యంలో మహిళా క్రికెట్‌లోనూ భారత క్రికెట్‌ లీగ్‌ను ప్రారంభించనున్నట్టు బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. తాజాగా సమాన వేతనాల అంశంతో పురుష, మహిళా క్రికెటర్ల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించింది.

ఎంత రానుంది..?

ఇకపై మహిళల జట్టుకు టెస్టు మ్యాచ్‌కు రూ.15లక్షలు, వన్డేకు రూ.6లక్షలు, టీ20కి రూ. 3లక్షలు బీసీసీఐ ఇవ్వనుంది. టీమిండియా మహిళల విషయంలో ఈ నిర్ణయం బీసీసీఐ బ్ధదతకు నిదర్శనం అంటూ జై షా పేర్కొన్నారు. తమకు అండగా నిలిచినందుకు బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌కు ధన్యవాదాలు. జైహింద్‌ అని ట్వీట్ లో పేర్కొన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.