Begin typing your search above and press return to search.

ఆ మ‌హిళల ఐదేళ్ల పోరాటం ఫ‌లించింది

By:  Tupaki Desk   |   30 Nov 2016 10:28 AM IST
ఆ మ‌హిళల ఐదేళ్ల పోరాటం ఫ‌లించింది
X
80మంది మహిళలు ఐదేళ్ల‌ న్యాయపోరాటం - ఆందోళనలు ఫ‌లించాయి. ముంబైలోని ప్రముఖ హజీ అలీ దర్గాలోనికి ప్రవేశం క‌ల్పించాల‌ని చేస్తున్న పోరాటానికి చ‌ట్ట‌బ‌ద్ద‌మైన అనుమ‌తి ద‌క్కిన నేప‌థ్యంలో వారు ద‌ర్గాలోనికి ద‌ర్జాగా ప్ర‌వేశించి ప్రార్థ‌న‌లు చేశారు. దైవ‌ ప్రార్థనలు చేయడంలో లింగ సమానత్వంపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఓ ప్రార్థన మందిరంలోకి మహిళలు ప్రవేశించడం ఇదే తొలిసారి.

2012 జూన్ వరకు ముంబైలోని సయ్యద్ పీర్ హజీ అలీ షా బుకారీ దర్గాలోనికి మహిళలను అనుమతించేవారు. అయితే ఎలాంటి ముంద‌స్తు స‌మాచాచ‌రం లేకుండానే ఒక్కసారిగా మహిళల ప్రవేశంపై ఆంక్షలు విధిస్తూ దర్గా ట్రస్టు నిర్ణయం తీసుకుంది. స్థానిక ముస్లిం మ‌హిళ‌లు అనుమ‌తి కోసం వేడుకున్న‌ప్ప‌టికీ అంగీక‌రించ‌లేదు. దీంతో ద‌ర్గాలోనికి మ‌హిళ‌ల ప్ర‌వేశాన్ని నిషేధించ‌డాన్ని సవాల్ చేస్తూ భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ సంస్థ 2014లో సుప్రీంకోర్టులో కేసు వేసింది. విచారణ చేపట్టిన జస్టిస్ వీఎం ఖనాడే - జస్టిస్ రేవతి మోహితి దీరే ఈ ఏడాది ఆగస్టు 26న పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. పురుషులతో సమానంగా మహిళలనూ అనుమతించాలని దర్గా టస్టుకు ధర్మాసనం సూచనలు చేసింది. దీంతో ట్ర‌స్టులోని పురుష స‌భ్యులు ఆదేశాల‌ను పాటించి మ‌హిళ‌ల‌కు అనుమ‌తి ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ సహ వ్యవస్థాపకురాలు నూర్జహాన్ నైజ్ మీడియాతో మాట్లాడుతూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ద‌ర్గాలోకి వెళ్లి ప్రార్థన పూర్తిచేసుకొని వచ్చామని తెలిపారు.

కాగా వీరితో క‌ల‌సి ముందుకు సాగుతున్న భూమాత బ్రిగేడియ‌ర్ నాయ‌కురాలు తృప్తి దేశాయ్ ఈ పరిణామంపై స్పందించారు. తమ తదుపరి లక్ష్యం కేరళలోని శబరిమల ఆలయంలోనికి ప్రవేశించడమని తృప్తి దేశాయ్ పేర్కొన్నారు. శబరిమలలోనికి మహిళల ప్రవేశాన్ని అనుమతించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం సైతం అంగీకారం తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/