Begin typing your search above and press return to search.

గడప గడపలో.. డిప్యూటీ స్పీకర్ కు చుక్కలు చూపించిన మహిళ!

By:  Tupaki Desk   |   31 May 2022 11:31 AM GMT
గడప గడపలో.. డిప్యూటీ స్పీకర్ కు చుక్కలు చూపించిన మహిళ!
X
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ అప్పుడే అన్ని పార్టీలు ప్రజలను చుట్టేస్తున్నాయి. అధికార వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ఇప్పటికే గడప గడపకూ మన ప్రభుత్వం పేరిట ప్రజల ముందుకు వెళ్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేని చోట అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ మూడేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు, వాటి వల్ల ప్రతి కుటుంబానికి కలిగిన లబ్ధిని వివరిస్తున్నారు. ఎంత మేర లబ్ధి పొందారో తెలుపుతూ ఒక కరపత్రాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా మరోసారి తమను గెలిపించి ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అందించిన లేఖను ప్రతి కుటుంబానికి అందిస్తున్నారు.

అయితే.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు, నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. వివిధ సమస్యలపై ఎక్కడకక్కడ గట్టిగా నిలదీస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అందడం లేదని.. మురుగు సమస్య ఉందని.. తాగునీరు లభించడం లేదని.. స్మశానానికి దారి లేదని ఇలా రకరకాల సమస్యలపై ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వ్యతిరేకతను అస్సలు ఊహించని వైఎస్సార్‌సీపీ నేతలు బిత్తరపోతున్నారు. తమపై ఈ స్థాయిలో వ్యతిరేకత ఉండటం చూసి తట్టుకోలేకపోతున్నారు.

ఈ నిరసనలను ముందుగానే ఊహించే రాష్ట్ర ప్రభుత్వం.. ఈ కార్యక్రమానికి గడప గడపకూ వైఎస్సార్‌సీపీ అనే పేరును మార్చి గడపకు గడపకూ మన ప్రభుత్వం అని పెట్టింది. తద్వారా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే పార్టీపై పడకుండా చర్యలు చేపట్టింది. అయినా కార్యక్రమం పేరు మార్చినప్పటికీ వైఎస్సార్‌సీపీ నేతల నుంచి ప్రజలకు నిరసనలు తప్పడం లేదు.

తాజాగా డిప్యూటీ స్సీకర్, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి ఓ మహిళ చుక్కలు చూపించింది. బాపట్లలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోన రఘుపతి అక్కడ పర్యటించారు. ఇందులో భాగంగా ఓ మహిళ ఆయనను నిలదీసి ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నికల్లో గెలిచిన మూడేళ్ల తర్వాత ప్రజల ముందుకు వస్తే సమస్యలు ఏం తెలుస్తాయని.. మందీ మార్బలాన్ని వదిలిపెట్టి వార్డుల్లో పర్యటిస్తే ప్రజా సమస్యలు తెలుస్తాయని ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీంతో కోన రఘుపతి షాక్ తిన్నారు. ఆ మహిళకు ప్రభుత్వ పథకాల గురించి వివరించే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వం వల్ల ఇప్పటివరకు ఆ మహిళకు ఎంత లబ్ధి చేకూరిందో వివరించారు. పనిలో పనిగా వచ్చే ఎన్నికల్లోనూ తమనే గెలిపించాలని వైఎస్ జగన్ అందించిన లేఖను ఆమెకు అందించారు. అయితే ముందు తమ వార్డులో పారిశుధ్యం సమస్య నెలకొందని.. ఎక్కడి చెత్తే అక్కడే పేరుకుపోతోందని.. దీన్ని పరిష్కరించాలని కోరింది. తప్పకుండా ఈ సమస్యను తీరుస్తామని ఆమెకు హామీ ఇచ్చి కోన రఘుపతి అక్కడ నుంచి పలాయనం చిత్తగించారు.

ఇటీవల మాజీ మంత్రి శంకర్ నారాయణ చేస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఆయనకు ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైన సంగతి తెలిసిందే. ఎక్కడకు వెళ్ళినా ఏ మండలంలో పర్యటించినా శంకర్ నారాయణను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. పరిగి మండలం చెర్లోపల్లి గ్రామంలో గెలిచిన మూడేళ్లకు తాము గుర్తుకు వచ్చామని ప్రజలు ఆయనను నిలదీశారు. తమ గ్రామంలో త్రాగు నీరు, అంగన్ వాడీ కేంద్రం, రహదారులు లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు వచ్చారా అంటూ గ్రామ ప్రజలు, యువకులు శంకర్ నారాయణపై మండిపడ్డారు. దీంతో ఆయన చేసేదేమీ లేక, వారికి సమాధానం చెప్పలేక అక్కడి నుండి జారుకున్నారు.

అలాగే పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలంలోని కావేటి నాగేపల్లిలో వాలేంటర్ పై మాజీ మంత్రి శంకర్ నారాయణ దాడి చేయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. వలంటీర్ ను కొట్టటానికి శంకర్ నారాయణ చేయి ఎత్తగా నన్ను కొట్టటానికి నువ్వు ఎవరు అంటూ వలంటీర్ ఎదురుతిరిగాడు.

రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లోనూ పరిస్థితి ఇదే మాదిరిగా ఉంది. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధాకర్ ను, అద్దంకి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్యను కూడా ప్రజలు ఇలాగే నిలదీశారు.