Begin typing your search above and press return to search.

మొన్న శబరిమలలోకి.. నేడు మసీదులోకి..

By:  Tupaki Desk   |   8 Jan 2019 11:06 AM GMT
మొన్న శబరిమలలోకి.. నేడు మసీదులోకి..
X
కేరళలో మహిళాలోకం కదం తొక్కుతోంది. మొన్ననే శబరిమలలోని పవిత్ర అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు దేశవ్యాప్తంగా దుమారం రేపారు. ఇప్పుడు తాజాగా అదే కేరళలో ఇద్దరు మహిళలు శబరిమల సమీపంలోని ఓ మసీదులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని వారిని అక్కడ నుంచి తరలించారు. వీరు తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు.

శబరిమల ఆలయానికి సమీపంలో ఉన్న వావర్ మసీదులోకి మహిళలు పోలీసుల కళ్లు గప్పి చెక్ పోస్టు గుండా వచ్చారు. వారు మసీదులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతించినప్పుడు మసీదులోకి ఎందుకు అనుమతించరని ఆ మహిళలు పోలీసులను నిలదీశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి సెక్షన్ 153 కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.. వీరు హిందూ మక్కల్ కట్చి అనే సంస్థకు చెందిన హిందుత్వవాదులుగా గుర్తించారు.

కాగా శబరిమల ఆలయంలోని మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గత ఏడాది తీర్పునిచ్చింది. దీన్ని ఇటీవలే కేరళలోని సీపీఎం సీఎం పినరయి విజయన్ పట్టుబట్టి అమలు చేయించారు. ఇప్పుడు దానికి పోటీగా హిందుత్వ మహిళలు మసీదులోకి వెళ్లడానికి ప్రయత్నించి కేరళ సీఎంకు గట్టి హెచ్చరికలు పంపారు. శబరిమలలోకి పంపిన ప్రభుత్వం మసీదులోకి పంపాలని వారు డిమాండ్ చేయడం కలకలం రేపుతోంది.