Begin typing your search above and press return to search.

ఏపీలో భారీ వాటర్ షెడ్..500 కోట్లతో ప్రపంచ బ్యాంక్ సిద్ధం!

By:  Tupaki Desk   |   28 Nov 2019 7:51 AM GMT
ఏపీలో భారీ వాటర్ షెడ్..500 కోట్లతో ప్రపంచ బ్యాంక్ సిద్ధం!
X
ఆంధ్రప్రదేశ్ లో భారీ వాటర్‌ షెడ్ ప్రాజెక్ట్ త్వరలోనే అమలు చేయడానికి ప్రపంచబ్యాంక్ సన్నద్ధం అవుతుంది. ఇప్పటి వరకు మన దేశంలో కర్ణాటక - ఒడిషాలలో వాటర్‌ షెడ్ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా వున్న ప్రపంచబ్యాంక్ తాజాగా ఏపీతో కూడా కలిసి పనిచేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపించింది. ప్రపంచబ్యాంక్ నిధులతో దేశం లోనే వాటర్‌ షెడ్ కార్యక్రమాలను అమలు చేసే మూడో రాష్ట్రంగా ఏపీని ఎంపిక చేసింది.

ఇందులో భాగంగా ఐదేళ్ల పాటు రాష్ట్రంలో దాదాపు 70 మిలియన్ డాలర్ల (సుమారు 500 కోట్లు) మేరకు రుణంగా అందించేందుకు ప్రపంచబ్యాంక్ సంసిద్దత వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం అమరావతిలోని సచివాలయంలో ఏడుగురు ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో కూడిన బృందం రాష్ట్ర పంచాయతీరాజ్‌ - గ్రామీణాభివృద్దిశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో భేటీ అయ్యింది. వాటర్‌ షెడ్ ప్రాజెక్ట్ లో 70శాతం ప్రపంచబ్యాంక్‌ - 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదవుతున్న రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాను మొదటిదశ వాటర్ షెడ్ అమలుకు ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ ను రాష్ట్ర గ్రామీణాభివృద్ది - వ్యవసాయ శాఖలు - ఎపి స్పేస్ అప్లికబుల్ సెంటర్ - వ్యవసాయ యూనివర్సిటీల కన్సార్టియం ద్వారా పర్యవేక్షణ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో నీటి యాజమాన్యంతో పాటు ఎపిశాట్‌ ద్వారా భూసార పరీక్షలు - ఎరువులు - పోషకాల విషయంలో రైతులకు మెరుగైన సూచనల ను అందించడం - వ్యవసాయంలో అవసరం లేని ఎరువులు - పోషకాల వినియోగానికి ఇక స్వస్తి చెప్పేలా వారిలో చైతన్యం కలిగించడం వంటి కార్యక్రమాలను ఇందులో నిర్వహిస్తామని తెలిపారు. భూసార నివేదికలను - నేల స్వభావాన్ని బట్టి ఏరకమైన పంటలు సాగు చేయవచ్చు తదితర అంశాలను కూడా వ్యవసాయశాఖ - వ్యవసాయ యూనివర్శిటీల భాగస్వామ్యంతో ఖరారు చేస్తామని ప్రపంచ బ్యాంక్ బృందం వెల్లడించారు.