Begin typing your search above and press return to search.

అమరావతికి ప్రపంచ బ్యాంకే పెద్ద దిక్కు

By:  Tupaki Desk   |   18 Nov 2015 7:11 AM GMT
అమరావతికి ప్రపంచ బ్యాంకే పెద్ద దిక్కు
X
ఏపీ రాజధాని అమరావతికి ప్రాథమిక ప్రణాళికలు అందాయి... భూమిపూజ - శంకుస్థాపన కూడా పూర్తయింది. ఇక మొదలవ్వాల్సింది నిర్మాణ పనులే.. అయితే... ఆర్థిక కష్టాలతో మునిగిన కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు నిధులే పెద్ద సమస్య కావడంతో నిర్మాణమే సవాల్ గా మారుతోంది. నిర్మాణానికి నిధుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ప్రపంచ శ్రేణి నగరంగా నిర్మిస్తున్న అమరావతికి భారీగా నిధుల అవసరం ఉంది. కేంద్రం నుంచి సహాయం అందుతుందన్న హామీ ఉన్నప్పటికీ అది ఎప్పుడు ఎంత అన్నది అస్పష్టమే. ఈలోగా పనులు ప్రారంభించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు రుణాలు తెచ్చుకునే పనిలోపడ్డారు. ప్రపంచబ్యాంకు రుణం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

రాజధాని కోసం రూ.35 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇటీవల కార్యదర్శుల స్థాయి అధికారుల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. కొత్త రాజధాని ఆర్థిక కేంద్రంగా మారనున్న నేపథ్యంలో రుణం ఇవ్వాలని ప్రపంచ బ్యాంకును కోరబోతున్నారు. దీనికోసం ఆరు నెలల ముందే ప్రక్రియ మొదలైంది. ఏ ఏడాదిలో ఏమి నిర్మిస్తారు అన్నది వివరిస్తూ రాజధాని నిర్మాణ ప్రణాళికలను, నిధుల అవసరంపై అంచనాలను కేంద్ర ప్రభుత్వానికి మే నెలలోనే పంపించారు. అయితే... కేంద్రం నుంచి ఆ స్థాయిలో నిధులు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రపంచబ్యాంకే ప్రత్యామ్నాయమని రాష్ట్రం భావిస్తోంది. ఇందుకు కేంద్రం నుంచి అనుమతులు అవసరం కావడంతో పట్టణాభి వృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో సీఎం చంద్రబాబు చర్చించారు కూడా. ఆయన సూచనల మేరకు ప్రపంచ బ్యాంకుకు పంపించేందుకు ప్రతిపాదనలు, నివేదికలను ఏపీ గవర్నమెంటు రెడీ చేస్తోంది. 35 ఏళ్ల కాలపరిమితితో నిర్మించనున్న అమరావతికి తొలి 10 సంవత్సరాలకు సంబంధించిన నివేదిక ప్రకారం రూ.35,508 కోట్లు అంచనాలు గల ప్రతిపాదనలు తయారు చేశారు. తొలి ఐదేళ్లలో రూ.15,570 కోట్లు, ఆరో ఏట నుండి పదో ఏట వరకూ రూ.19,938 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. ఈ వివరాలను ప్రపంచ బ్యాంకుకు పంపి, అక్కడి నుంచి ఆసియా డెవలప్‌ మెంట్‌ బ్యాంకు ద్వారా రుణం తీసుకోనున్నారు.

తొలి పదేళ్లు కేంద్రం - ప్రపంచబ్యాంకుల సహకారంతో నిధులు రాబడితే ఆ తరువాత ఇక్కడ పెట్టుబడి పెట్టిన విదేశీ కంపెనీల ఆర్థిక లావాదేవీల ద్వారా కొంత ఆదాయం సమకూరుతుంది కాబట్టి దాంతో నిర్మాణ పనులను నడిపించొచ్చు. వచ్చే పదేళ్ల కోసం ఇప్పుడు చంద్రబాబు తీవ్రస్థాయిలో నిధులు వేట సాగిస్తున్నారు.