Begin typing your search above and press return to search.

భార‌త్-పాక్‌ ల వివాదాల‌కు వ‌ర‌ల్డ్ బ్యాంక్ చెక్‌!

By:  Tupaki Desk   |   13 Dec 2016 12:23 PM GMT
భార‌త్-పాక్‌ ల వివాదాల‌కు వ‌ర‌ల్డ్ బ్యాంక్ చెక్‌!
X
పొరుగు దేశాలు అయిన‌ప్ప‌టికీ నిత్యం వివాదాల్లో ఉండే భార‌త్‌-పాకిస్తాన్‌ ల మ‌ధ్య నెల‌కొన్న వివాదాల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌పంచ బ్యాంకు రంగంలోకి దిగింది. ఇరుగు పొరుగు దేశాల మ‌ధ్య ఉన్న‌ సింధు జ‌లాల ఒప్పందం అమ‌లులో త‌లెత్తుతున్న వివాదాల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఎవ‌రి ఇష్టం వ‌చ్చిన‌ట్లు వాళ్లు ముందుకు వెళ్ల‌కుండా ప్ర‌పంచ బ్యాంక్‌ బ్రేక్ వేసింది. ఈ వివాదాల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డానికి ప్ర‌త్యామ్నాయ మార్గాలు చూడాల‌ని రెండు దేశాల‌కు సూచించింది.

జ‌మ్ముక‌శ్మీర్‌ లో భార‌త్ చేప‌డుతున్న కిష‌న్‌ గంగ‌ - రాట్లె జ‌ల‌విద్యుత్ ప్రాజెక్టుల‌పై పాకిస్థాన్ ప్ర‌పంచ‌బ్యాంక్‌ కు ఫిర్యాదుచేసింది. ఆ దేశం ఫిర్యాదు మేర‌కు గ‌త నెల‌లో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేష‌న్‌ ను ఏర్పాటుచేసి - న్యూట్ర‌ల్ ఎక్స్‌ పెర్ట్‌ ను నియ‌మిస్తామ‌ని, డిసెంబ‌ర్ 12లోగా ఈ ప్ర‌క్రియ పూర్తిచేస్తామ‌ని వ‌ర‌ల్డ్ బ్యాంక్ తెలిపింది. అయితే దీనిపై భార‌త్ తీవ్ర నిర‌స‌న తెల‌ప‌డంతో వెనుకంజ వేసింది. న్యాయ‌ప‌రంగా ఇది సాధ్యం కాద‌ని భార‌త్ తేల్చిచెప్పింది. ఈ నేప‌థ్యంలో సింధు నదీ జ‌లాల ఒప్పందాన్ని ర‌క్షించ‌డానికే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వ‌ర‌ల్డ్ బ్యాంక్ అధ్య‌క్షుడు జిమ్ యాంగ్ కిమ్ అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న రెండు దేశాల ఆర్థిక మంత్రుల‌కు వేర్వేరుగా లేఖ‌లు రాశారు. ఈ ఒప్పందానికి ర‌క్ష‌ణ‌గా ప్ర‌పంచ బ్యాంకు వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

రెండు దేశాలు చేప‌డుతున్న ప్ర‌క్రియ‌ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డంతోపాటు స‌మ‌స్య ప‌రిష్కారం కోసం నియ‌మించ‌ద‌ల‌చిన‌ కోర్ట్ ఆఫ్‌ ఆర్బిట్రేష‌న్ చైర్మ‌న్ లేదా న్యూట్ర‌ల్ ఎక్స్‌ పెర్ట్ నియామ‌కాన్ని కూడా వ‌ర‌ల్డ్ బ్యాంక్ నిలిపేసింది. అయితే ఒప్పంద స్ఫూర్తితో రెండు దేశాలు స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌త్యామ్నాయ మార్గాలు చూడాల‌ని, జ‌న‌వ‌రి చివ‌రిలోగా రెండు దేశాల మ‌ధ్య ఓ అవ‌గాహ‌న కుదురుతుంద‌న్న ఆశాభావం కిమ్ వ్య‌క్తంచేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/