Begin typing your search above and press return to search.

కేసీఆర్ బాట‌లోనే చీర‌లు పంచిన ఆంధ్రా ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   27 Sep 2017 11:53 AM GMT
కేసీఆర్ బాట‌లోనే చీర‌లు పంచిన ఆంధ్రా ఎమ్మెల్యే
X
తెలంగాణ సంప్ర‌దాయ పండుగ బ‌తుక‌మ్మ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆడ‌బిడ్డ‌ల‌కు చీర‌లు పంచేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. చేనేత చీర‌లంటూ భారీగా ప్ర‌చారం చేసి.... నాసిర‌కం చీర‌లు ఇవ్వ‌డంతో ర‌చ్చ ర‌చ్చ అవ‌డం కూడా మ‌నంద‌రం చూశాం. అయిన‌ప్ప‌టికీ కేసీఆర్ ప్ర‌య‌త్నాన్ని అయితే ప‌లువురు అభినందించారు. ఈ విష‌యం ఎలా ఉన్నా...ఏపీలో ఓ ఎమ్మెల్యే చీర‌లు పంపిణీ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స్పూర్తితో అయిఉండ‌వ‌చ్చు లేదా త‌నంత‌ట తాను ప్ర‌జల‌కు మేలు చేసేందుకు కావ‌చ్చు కానీ...ఆయ‌న చీర‌లు పంపిణీ చేశారు. అయితే అది అంద‌రికీ కాదు...కేవ‌లం తెలుగుదేశం పార్టీ వారికే.

ఇంత‌కీ ఆ ఎమ్మెల్యే ఎవ‌రంటే...గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇంటింటికీ తెదేపాలో భాగంగా ఆయ‌న చీరలు పంచారు. ఎమ్మెల్యేగా ఉన్నా, లేకున్నా 25 ఏళ్ల నుంచి నియోజకవర్గ ప్రజలు తనను ఆదరిస్తున్నారని, ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేనని ఎమ్మెల్యే యరపతినేని అన్నారు. జీవితాంతం వారికి సేవ చేసుకుంటానని అందులో భాగంగానే ఇంటింటికీ తెదేపాలో పేదలు, వృద్ధులు, మహిళలకు వ్యక్తిగత సాయం చేయడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్లను గుర్తించి ఆ వృద్ధ‌ దంపతులను శాలువాతో సత్కరించి, వస్త్రాలను బహూకరిస్తూ షష్టి పూర్తి చేస్తున్నట్లు ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని తెలిపారు. గ్రామాల్లోని గర్భిణులను ముందుగానే గుర్తించి వారందరికీ సీమంతం చేస్తూ రూ.2 వేల నగదు, మరో రూ.2 వేల విలువతో కూడిన చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులను పుట్టింటి సారె కింద అందజేస్తున్నట్లు తెలిపారు. నిరుపేద కుటుంబాల్లోని వృద్థులు, వికలాంగులకు కూడా తగిన సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తంగెడలోని ముస్లిం మహిళలతోసహా అన్ని వర్గాల్లో ఉన్న 50 మంది గర్భిణులకు ఆయన, సతీమణి నాగమణి, తనయుడు సాయినిఖిల్‌ సీమంతం చేశారు. చీరసారె అందజేశారు.

కాగా ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని త‌మ పార్టీ గురించి ధీమా వ్య‌క్తం చేశారు. మరో పాతికేళ్లు అధికారం మాదేనని ఎమ్మెల్యే జోస్యం చెప్పారు. నవ్యాంధ్ర ప్రజల ఆశీస్సులతో చంద్రబాబే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అన‌నారు. నంద్యాల, కాకినాడ తీర్పే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉంటుందని, ఆ తర్వాత కూడా ఇంకో 20 ఏళ్లు అధికారంలో ఉంటామని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.