Begin typing your search above and press return to search.

వాగ్వాదంతో మొదలై.. సుబ్రహ్మణ్యం హత్య జరిగిందిలా..: ఎస్సీ ఏంచెప్పారంటే..

By:  Tupaki Desk   |   24 May 2022 2:47 AM GMT
వాగ్వాదంతో మొదలై.. సుబ్రహ్మణ్యం హత్య జరిగిందిలా..: ఎస్సీ ఏంచెప్పారంటే..
X
తన మాజీ డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యంను తానే హత్య చేశానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్ భాస్కర్ అంగీకరించారు. తనను ఎదిరించాడనే ఒకే ఒక్క కారణంతో అతడిని చంపానని ఒప్పుకున్నారు. ఈ మేరకు సోమవారం తూర్పు గోదావరి జిల్లా పోలీసుల ఎదుట ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. కాగా తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును తూర్పు గోదావరి జిల్లా పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కాకినాడ స్పెషల్‌ మొబైల్‌ మేజిస్ట్రేట్‌ సి.జానకి ఎదుట అనంతబాబును హాజరుపరిచారు. మేజిస్ట్రేట్‌ ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ఆయనను రాజమం‍‍డ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

సోమవారం రాత్రి కాకినాడ ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను ఎస్సీ వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితుడు అనంతబాబును ఆరు బృందాలతో గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. తనను ఎదిరించాడనే ఒకే ఒక్క కారణంతో సుబ్రహ్మణ్యంను అనంతబాబు హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌ బాబు తెలిపారు. సుబ్రహ్మణ్యం మృతిపై తల్లి ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు తొలుత అనుమాన్పాద మృతి కింద కేసు నమోదు చేశారని చెప్పారు. శవ పంచనామా సమయంలో సుబ్రహ్మణ్యం బంధువులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. హత్య కేసుగా మార్చామని వివరించారు. హత్య కేసు విచారణను డీఎస్పీ భీమారావుకి అప్పగించామన్నారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు పర్యవేక్షణలో కాకినాడలోని ఏఆర్‌ కార్యాలయంలో ఎమ్మెల్సీని సుదీర్ఘంగా విచారించామని చెప్పారు. విచారణలో ఆయన చెప్పిన వివరాలు, దర్యాప్తులో లభించిన సాంకేతిక ఆధారాలతో ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితుడిగా నిర్ధారించామన్నారు.

మే 19న రాత్రి 8 గంటల సమయంలో తన ఇంటి నుంచి బయటకు సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లాడు. కాకినాడ శ్రీరామ్‌నగర్‌లోని పాత నవభారత్‌ పబ్లిక్‌ స్కూల్‌ వద్ద స్నేహితులతో కలిసి రాత్రి 10.15 గంటల వరకు మందు పార్టీలో ఉన్నాడు. అదే సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు కారులో అక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యంను ఎక్కించుకుని వెళ్లారు. కాకినాడ జన్మభూమి వద్ద అల్పాహారం కట్టించుకుని రాత్రి 10.30 గంటలకు శ్రీరామ్‌ నగర్‌లోని ఎమ్మెల్సీ నివాసానికి చేరుకున్నారు.

నీ వివాహం కోసం ఇచ్చిన డబ్బుల్లో ఇంకా తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎప్పుడు ఇస్తావని ఎమ్మెల్సీ అనంతబాబు.. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ప్రశ్నించారు. నువ్వు మందుకు బాగా అలవాటుపడ్డావని.. నీ ప్రవర్తన బాగుంటే మళ్లీ నిన్ను విధుల్లోకి తీసుకోవాలని మీ అమ్మ కోరుతోందని ఎమ్మెల్సీ అతడితో అన్నారు. దీంతో మత్తులో ఉన్న సుబ్రహ్మణ్యం అనంతబాబుతో గొడవ పడ్డాడు. దీంతో అనంతబాబు.. నన్నే ఎదిరిస్తావా అంటూ సుబ్రహ్మణ్యాన్ని కొట్టారు. తోసేయడంతో సుబ్రహ్మణ్యం అక్కడే ఉన్న డ్రైనేజీ గట్టుమీద పడ్డాడు. దీంతో సుబ్రహ్మణ్యం తలకు గాయమై రక్తస్రావంతో కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్సీ ప్రయత్నించారు. ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వేరే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో కారులో ఉన్న సుబ్రహ్మణ్యంకు వెక్కిళ్లు వచ్చాయి. దీంతో అనంతబాబు అతడికి నీళ్లు పట్టించేందుకు ప్రయత్నించారు. అయితే సుబ్రహ్మణ్యం నుంచి ఎలాంటి స్పందన లేదు. అప్పటికే అతడి శ్వాస ఆగిపోవడం గమనించిన ఎమ్మెల్సీ అనంతబాబు.. సుబ్రహ్మణ్యం మృతి చెందినట్లు గుర్తించారు.

తన వద్ద డ్రైవర్‌గా పనిచేసే సమయంలో పలుమార్లు తాగి సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో అనంతబాబు.. సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లి వాళ్ల ఇంట్లో దింపుతుండేవారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం మృతి చెందడంతో ఎమ్మెల్సీ తాను చేసిన హత్యను రోడ్డు ప్రమాదంగా మార్చడానికి పన్నాగం పన్నారు. కాకినాడ నాగమల్లితోట రోడ్డులోని జి.కన్వెన్షన్‌ వద్దకు వెళ్లారు. అక్కడ బాగా జనాలు ఉండటంతో డంపింగ్‌ యార్డును ఎన్నుకున్నారు. రోడ్డు ప్రమాదం అని నమ్మించాలంటే సుబ్రహ్మణ్యం ఒంటిపై దెబ్బలు ఉండాలని భావించి.. కర్రతో అతడి మృతదేహాన్ని కొట్టారు.

గురువారం అర్ధరాత్రి (తెల్లవారితే శుక్రవారం) 12.30 గంటల ప్రాంతంలో సుబ్రహ్మణ్యం తల్లికి ఎమ్మెల్సీ అనంతబాబు ఫోన్‌ చేసి సుబ్రహ్మణ్యంకు రోడ్డు ప్రమాదం జరినట్లు తనకు ఫోన్‌ వచ్చిందని చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతానికి తాను వెళ్తున్నానని మీరు రావాలని కోరారు. ఆ తర్వాత రాత్రి 1.30 గంటల సమయంలో మృతుడి సోదరుడు నవీన్‌కు ఫోన్‌ చేసి సుబ్రహ్మణ్యాన్ని అమృత ఆస్పత్రికి తీసుకెళ్తున్నాని.. అక్కడికి రావాలని చెప్పారు. అక్కడ ఈసీజీ తీసిన వైద్యులు సుబ్రహ్మణ్యం అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో అమృత ఆస్పత్రి నుంచి సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని అతడి తమ్ముడు నవీన్‌తో కలిసి కారులో రాత్రి 2.30 గంటల సమయంలో రాజాట్యాంక్‌ సమీపంలోని తల్లిదండ్రులు కాపలా ఉంటున్న అపార్టుమెంటు వద్దకు తీసుకొచ్చారు. సుబ్రహ్మణ్యం కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదం కాదని.. అసలు ఏం జరిగిందో చెప్పాలని ఎమ్మెల్సీని నిలదీశారు. దీంతో మృతుడి ఇంటి నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు చెక్కేశారు.