Begin typing your search above and press return to search.

వైసీపీ ధిక్కార ధోరణి... సుప్రీంకోర్టులో కేసు!

By:  Tupaki Desk   |   8 Aug 2022 5:30 PM GMT
వైసీపీ ధిక్కార ధోరణి... సుప్రీంకోర్టులో కేసు!
X
వైసీపీ సర్కార్ ఏర్పడిన తరువాత కోర్టులలో అనేక కేసులు ఫైల్ అవుతూ వచ్చాయి. వాటి తీర్పుల ఆధారంగా కొన్ని నిర్ణయాలలో వెనకడుగు వేసిన సందర్భాలు ఉన్నాయి. మరి కొన్ని కేసులలో మాత్రం ప్రభుత్వం కోర్టు తీర్పులను గౌరవిస్తూనే అమలు విషయంలో కొంత జాప్యం చేస్తోందని పిటిషనర్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఏపీ సర్కార్ మీద కోర్టు కేసులు కొత్త కాదు, తీర్పులు కూడా కీలకమైనవి చాలా వచ్చాయి.

అయితే అమరావతి రాజధాని విషయంలో వచ్చిన తీర్పు మాత్రం చాలా ముఖ్యమైనది, అలాగే ప్రధానమైనది. ఇది రాజకీయాలకు కూడా సంబంధించినది. ఇక ఏపీలో మూడు రాజధానులు అంటూ జగన్ సర్కార్ చేసిన చట్టాన్ని ప్రభుత్వమే వేనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అమరావతి రైతుల పక్షాన తీర్పు వెలువడింది. ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని హైకోర్టు విస్పష్టంగా చెప్పింది.

అలాగే ఆరు నెలల వ్యవధిలోగా అమరావతి రాజధాని భూములను అభివృద్ధి చేసి ప్లాంట్స్ గా వేసి రైతులకు అప్పగించాలని హై కోర్టు తీర్పులో కోరింది. ఈ విషయంలో తమకు మరింత వ్యవధి కావాలని ప్రభుత్వం హై కోర్టుకు నివేదించుకుంది.

అయితే ప్రభుత్వం హై కోర్టు తీర్పు మేరకు రాజధాని భూముల అభివృద్ధి విషయంలో ఏ మాత్రం శ్రద్ధ చూపించడం లేదని పేర్కొంటూ అమరావతి రైతులు సుప్రీం కోర్టు తలుపులు తట్టారు.

ఏపీ సర్కార్ మీద కోర్టు ధిక్కారం మీద చర్యలు తీసుకోవాలని కోరారు. అమరావతి రాజధాని విషయంలో ఏ మాత్రం అభివృద్ధి లేకపోవడం వల్ల ప్రజా ధనం కూడా భారీ ఎత్తున నష్టపోతున్నామని వారు చెప్పారు. ఇటుక సిమెంట్, ఇనుము వంటివి కూడా నిర్మాణ పనులకు ఉపయోగించకపోవడం వల్ల దొంగల పాలు అయ్యాయని కూడా వివరించారు.

ఇక అమరావతి రాజధాని కోసం వేలాదిగా రైతులు భూములు ఇచ్చారని, అక్కడ ఏ మాత్రం అభివృద్ధి లేకపోవడం వల్ల రైతుల భవిష్యత్తు అంధకారం అయింది అని వారు సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. తమ పిటిషన్ ని సాధ్యమైనంత త్వరగా విచారించాలని వారు కోరారు. మరి ఈ పిటిషన్ని సుప్రీం కోర్టు విచారిస్తే ఏపీ సర్కార్ కి ఏ రకమైన డైరెక్షన్స్ వస్తాయో చూడాలి.