Begin typing your search above and press return to search.

ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గని వైసీసీ బ‌హిష్కృత నేత‌.. అక్క‌డి నుంచే పోటీ!

By:  Tupaki Desk   |   27 Aug 2022 1:30 PM GMT
ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గని వైసీసీ బ‌హిష్కృత నేత‌.. అక్క‌డి నుంచే పోటీ!
X
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర్సాపురం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ర్సాపురం నుంచే తాను పోటీ చేస్తాన‌న్నారు. అయితే ఏ పార్టీ నుంచి అనేది ఆయ‌న చెప్ప‌లేదు. ఇటీవ‌ల వ‌ర‌కు వైఎస్సార్సీపీలో ఉన్న ఆయ‌న‌ను ఆ పార్టీ బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే.

కొత్తపల్లి సుబ్బారాయుడు నర్సాపురం నియోజకవర్గం నుంచి 1989 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు అక్కడ నుంచే విజయం సాధించారు. 1999లో చంద్రబాబు కేబినెట్‌లో విద్యుత్ శాఖ‌ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరి నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచారు.

ఆ తర్వాత రాష్ట్ర విభజన, మారిన రాజకీయ సమీకరణలతో 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరి నర్సాపురం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. మళ్లీ తిరిగి టీడీపీలో చేరగా.. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కింది.. మళ్లీ ఆ పదవికి రాజీనామా చేసి 2019 ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి ఆ పాార్టీలోనే కొనసాగారు. అయితే 2019లో కొత్త‌ప‌ల్లికి సీటు ద‌క్క‌లేదు. ముదునూరి ప్ర‌సాద‌రాజుకి వైఎస్సార్సీపీ సీటు ఇచ్చింది. ప్ర‌స్తుతం ముదునూరి ప్ర‌సాద‌రాజు ప్ర‌భుత్వ చీఫ్‌విప్ గా ఉన్నారు.

జిల్లాల విభ‌జ‌న సంద‌ర్భంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు న‌ర‌సాపురాన్ని కేంద్రంగా చేయ‌కుండా భీమ‌వ‌రాన్ని కేంద్రంగా చేయ‌డంతో కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

న‌ర్సాపురంను జిల్లా కేంద్రంగా చేయాల‌ని జేఏసీతో క‌ల‌సి ఉద్య‌మాలు కూడా చేశారు. అంతేకాకుండా ముదునూరి ప్ర‌సాద‌రాజుపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ముదునూరిని గెలిపించినందుకు త‌న చెప్పుతో తాను కొట్టుకుంటున్నాని అప్ప‌ట్లో చెప్పుతో కూడా కొట్టుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ ఆయ‌న‌ను పార్టీ నుంచి బ‌హిష్కరించింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. న‌ర్సాపురం నుంచే బ‌రిలో ఉంటాన‌న్నారు.
ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్న విషయం మాత్రం చెప్ప‌లేదు. గ‌తంలో ఇదే విష‌యంపై మాట్లాడిన ఆయ‌న స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని చెప్పిన సంగ‌తి తెలిసిందే. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు మంచి ప‌ట్టు ఉంద‌ని.. అన్ని కులాల్లో త‌న‌కు ప‌డే ఓట్లు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చారు.. నర్సాపురంలో గెలుపు తనదేనన్నారు.