Begin typing your search above and press return to search.

'గ‌డ‌ప గ‌డ‌ప‌కు'... వైసీపీ స‌ర్కారు సాధించిందేంటి?

By:  Tupaki Desk   |   17 Jun 2022 10:30 AM GMT
గ‌డ‌ప గ‌డ‌ప‌కు... వైసీపీ స‌ర్కారు సాధించిందేంటి?
X
కొన్నికొన్ని విష‌యాలు చాలా చిత్రంగా ఉంటాయి. అంతే విచిత్రంగానూ ఉంటాయి. ఇప్పుడు ఏపీని పాలిస్తున్న వైసీపీ విష‌యంలోనూ ఇలాంటి చిత్రాలే క‌నిపిస్తున్నాయి. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మకంగా చేప‌ట్టి న‌.. ``గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం`` కార్య‌క్ర‌మం ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోగా.. 2024లో వైసీపీకి ఎదుర‌య్యే భవిత‌వ్యాన్ని తేల్చి చెబుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరిట వస్తున్న అధికారపక్ష ఎమ్మెల్యేలను.. మూడేళ్లుగా ఏం చేశారంటూ ప్ర‌జ‌లు కండువాలు పట్టుకుని నిలదీస్తున్నారు.

ఇంటి పట్టాలు..ఇల్లు .. పింఛన్లు జగన్‌ ప్రభుత్వంలోనే వస్తున్నాయంటూ గొప్పలు చెప్పబోయిన ఎమ్మెల్యే లకు చుక్కలు చూపిస్తున్నారు. ‘చాలు చాల్లే .. ఇందిరమ్మకాలం నాటి నుంచీ ఇళ్లు కట్టించి ఇస్తున్నారు... పింఛన్లు కూడా ఇప్పటివి కావు.. జగన్‌ వచ్చిన తర్వాతే వృద్ధాప్య పింఛన్లు..వితంతు పింఛన్లు ఇవ్వడం ప్రారంభం కాలేదు’’ అంటూ తిరగబడుతున్నారు. అసలు ఇక్కడికి ఎందుకొచ్చారంటూ ఎదురు తిరుగు తున్నారు. ముఖ్యంగా మహిళల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం వైసీపీ ఎమ్మెల్యేలకు దిక్కుతోచని పరిస్థితిని తెచ్చిపెట్టింది.

ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధిపైనా.. రాజ‌ధానిపైనా.. రోడ్లు, మురుగు కాలువలు, తాగు నీటి సదుపాయా ల సంగతుల‌పైనా ప్రజలు నిల‌దీస్తున్నారు. దీంతో వైసీపీ ప్రజా ప్రతినిధుల నుంచి సమాధానం రావడం లేదు. చెత్తపైనా పన్ను వేస్తారా అని మహిళల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై స్థానిక నేతలు సమాధానం ఇవ్వబోతుంటే .. మహిళలు మరింత కోపంతో ఊగిపోతున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుం దని భావిస్తున్న తరుణంలో ఎమ్మెల్యేలు అక్కడి నుంచి చల్లగా జారుకుంటున్నారు.

మాట‌కారి కూడా మౌనం!

ప్రకాశంజిల్లా ఒంగోలు నియోజకవర్గంలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చుక్కెదురయింది. వాస్త‌వానికిఈయ‌న‌కు మంచిమాట‌కారి అనేపేరుంది. అయితే.. ఆయ‌న‌ను కూడా మ‌హిళ‌లు గుక్క‌తిప్పుకోనివ్వ‌డం లేదు. ‘గడప..’లోకి వచ్చిన బాలినేనిని ప్రజలతోపాటు స్థానిక వైసీపీ మహిళా నేతలు సైతం నిలదీశారు. తమ పార్టీ నాయకులపైనే మాజీ మంత్రికి ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే గ‌ల్లా ప‌ట్టుకుని..

అరకు ఎమ్మెల్యే చెట్టి ఫ‌ల్గుణపై గిరిజన మహిళలు ఎదురుతిరిగారు. తమ స్థలాన్ని కబ్జా చేశావంటూ చొక్కా పట్టుకుని గుంజారు. దీంతో ఆయన నిశ్ఛేష్టుడై వచ్చిన కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలేసి పారిపోయినంత పనిచేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలెక్కడ అంటూ ఎమ్మెల్యేపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జ‌గ‌న్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని .. పింఛన్లు, ఇళ్లు ఇస్తోందంటూ పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చెప్పబోగా.. అక్కడున్న మహిళలే ఎదురుతిరిగారు.

సంక్షేమం కొత్త‌కాదు

ఇందిరమ్మ కాలం ఉంచీ పేదవారికి .. ఎస్సీ , ఎస్టీలకు కాలనీలు నిర్మించి ఇచ్చారంటూ వైసీపీ నేత‌ల‌తో ప్ర‌జ‌లు వాదనకు దిగుతున్నారు. జ‌గ‌న్‌ పింఛన్లు ఇస్తున్నారని అనడంతో .. పింఛన్లు తమకు ఎప్పటి నుంచో వస్తున్నాయని .. జగనొచ్చాకే ఇస్తున్నాడా అని మహిళలు నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే బాలరాజుకు ఏంచెప్పాలో పాలుపోక మౌనందాల్చారు.

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి పెద్దపెండేకల్లులో పర్యటించారు. స్థానికంగా ఉంటున్న పార్వతి అనే గృహిణి ఇంటికి సాయిప్రసాద్‌రెడ్డి వెళ్లారు. ‘అమ్మఒడి రాలేదు రెడ్డీ... ఇంటి స్థలమూ ఇవ్వలేద’ని పార్వతి దంపతులు... ఎమ్మెల్యేను గట్టిగా నిలదీశారు. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే ‘నీకు నోరు గట్టిగా ఉందే.. నాకేం చెవుడు లేదు... గట్టిగా మాట్లాడకు’ అంటూ దబాయించారు. దీంతో ఆవేదనకు గురైన పార్వతి ఏమాత్రం తగ్గకుండా... ‘మాకు రాలేదు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం. ఇంటిముందు కొళాయి వేసినా చుక్కనీరు రావడం లేదు. అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఒక్కసారే అమ్మఒడి పడింది. వచ్చిన సొమ్ములో వైసీపీ నాయకులకు రూ.5వేలు ఇచ్చామంటూ ధాటిగా బదులిచ్చారు.

కొస‌మెరుపు!

ఇలా మొత్తంగా.. వైసీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన‌... ఈ కార్య‌క్ర‌మం.. 2024 నాటి భవిష్య‌త్తును క‌ళ్ల‌ముందు క‌నిపించేలా చేస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. నిజానికి ఎంతో ఆశ‌ల‌తో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంబించినా.. సంక్షేమం ఫ‌లితం ఇవ్వ‌డం లేద‌ని.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. మ‌రి దీనిపై జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుని ముందుకు వెళ్తారో చూడాలి.