Begin typing your search above and press return to search.

సుబ్బారాయుడు తేల్చేశారు : రాజు గారికి బీపీ పెంచేశారు...?

By:  Tupaki Desk   |   1 Jun 2022 4:30 PM GMT
సుబ్బారాయుడు తేల్చేశారు : రాజు గారికి బీపీ పెంచేశారు...?
X
ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ కూడా అనేక ఎన్నికల యుద్ధాలలో పోటీ చేసి నిలిచి గెలిచిన మేటి. ఆయన నర్సాపురం జిల్లాకు చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఆయన లేటెస్ట్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో ఒక సంగతి తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను నర్సాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానను బల్లగుద్ది మరీ చెప్పారు.

వైసీపీ అధినాయకత్వం టికెట్ తనకే ఇవ్వాలని కూడా మీడియా ముఖంగా కోరారు. ఒకవేళ ఇవ్వకపోతే అన్న మీడియా ప్రశ్నకు ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా గెలుస్తాను అని జబ్బలు చరిచారు. అంటే కొత్తపల్లి వారి రూటే సెపరేట్ అనుకోవాల్సిందే. ఆయన టీడీపీ నుంచే అనేక విజయాలను అందుకున్నారు. మంత్రిగా ఆ పార్టీ నుంచే పనిచేశారు. అలాంటి కొత్తపల్లి సుబ్బారాయుడు వచ్చే ఎన్నికలలో పోటీ అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజుకు హై బీపీ తెప్పించారు అని అంటున్నారు.

ఆయన 1983 నుంచి చూస్తే 2014 దాకా ప్రతీ ఎన్నికల్లలోనూ నర్సాపురం నుంచే పోటీ చేస్తూ వస్తున్నారు. అలాగే ఎన్నో సార్లు విజయాలూ సొంతం చేసుకున్నారు. కానీ 2019లో మాత్రం వైసీపీలో చేరినా టికెట్ ఇవ్వలేదు. ప్రసాదరాజు గెలుపుకోసం పనిచేస్తే అధికారంలోకి వచ్చాక చూస్తామని హామీ ఇచ్చారు. తీరా వైసీపీ పవర్ లోకి వచ్చింది కానీ కొత్తపల్లికి ఏ పదవీ దక్కలేదు. దాంతో ఈ సీనియర్ నాయకుడికి మండిపోతోంది.

దానికి తోడు నర్సాపురం జిలా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ వినిపిస్తే ఎమ్మెల్యే ప్రసాదరాజు పట్టించుకోలేదు. దాంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జనంలోకి వెళ్ళారు ఉద్యమాలు చేశారు. అలా పార్టీలో ఉంటూనే రాజు గారికి యాంటీగా కుంపటి రాజేసి తమ వైపు సింపతీ తెచ్చుకున్నారు. ఒక దశలో చెప్పుతో కూడా కొట్టుకున్నారు.

ఇంతచేసిన సుబ్బారాయుడు రాజుని మాజీని చేస్తే కానీ వదిలేది లేదని శపధం పట్టారు. అందుకే తానే వచ్చే ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధిని అని రెచ్చగొడుతున్నారు. ఇక వైసీపీ చూస్తే ఎటూ ఆయనకు టికెట్ ఇవ్వదని అంటున్నారు. ప్రసాదరాజు జగన్ కి నమ్మిన బంటు. ఆయన్ని కాదని కొత్తపల్లికి టికెట్ ఇవ్వడం అసలు జరిగే వ్యవహారమే కాదు.

మరి ఇదంతా తెలిసే సుబ్బారాయుడు ఇలా మట్లాడారు అంటున్నారు. టికెట్ అడిగి ఇవ్వకపోతే అపుడు వైసీపీ మీద నిందలేసి బయటకు రావాలని ప్లాన్ సిద్ధం చేసుకున్నారు అంటున్నారు. ఆ విధంగా ఆయన తన సొంతబలాన్ని పెంచుకుంటూనే రేపటి రోజున టీడీపీలో అయినా మరో పార్టీలో అయినా చేరి పోటీకి దిగాలని అనుకుంటున్నారు అని చెబుతున్నారు. మొత్తానికి సుబ్బారాయుడు బస్తీమే సవాల్ అంటున్నారు. నర్సాపురం నాది అని కూడా సౌండ్ చేస్తున్నారు. వైసీపీకి రాజు గారికీ పెద్ద చిక్కే వచ్చి పడిందిపుడు.