Begin typing your search above and press return to search.

క‌లెక్ట‌ర్‌పై వైసీపీ నేత‌ల ఫైర్‌.. ఏం జ‌రిగిందంటే!

By:  Tupaki Desk   |   5 April 2022 7:30 AM GMT
క‌లెక్ట‌ర్‌పై వైసీపీ నేత‌ల ఫైర్‌.. ఏం జ‌రిగిందంటే!
X
కొత్తగా ఏర్ప‌డిన జిల్లాల్లో అప్పుడే రాజ‌కీయ ర‌గ‌డ రాజుకుంది. నూతనంగా ఏర్పడిన ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని నంద్యాల జిల్లా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. ప్రారంభోత్సవ శిలాఫలకంపై తమ పేర్లు లేక‌పోవ‌డంతో వారంతా ఖంగుతిన్నారు. దీంతో వెంట‌నే జిల్లా కలెక్టర్ గా వ‌చ్చిన కొత్త అధికారి మనజీర్ జిలానిని.. శాసనసభ్యులు శిల్పాచక్రపాణి రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, తొగురు ఆర్థర్ నిలదీశారు.

శాసనసభ్యుల్ని మర్చిపోయారా..? ప్రోటోకాల్ పాటించలేదు ఎందుకని? అంటూ కలెక్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించ‌క‌పోతే.. స్పీక‌ర్ కు ఫిర్యాదు చేస్తామ‌ని కూడా వారు హెచ్చరించ‌డంతో వివాదం చెల‌రేగింది. జిల్లా ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫ‌ల‌కంపై ఆ జిల్లా ప‌రిధిలోని త‌మ‌ పేర్లు లేవని తెలుసుకున్న‌ వైసీపీ ఎమ్మెల్యేలు తొలుత ఏం జ‌రిగింద‌ని ఆరా తీశారు. కొంద‌రు పొరుగున కొత్త‌గా ఏర్ప‌డిన జిల్లాల ఎమ్మెల్యేల‌కు ఫోన్లు చేసి.. అక్క‌డ కూడా ఇలానే జ‌రిగిందా? ఏంటి? అని ఆరాదీశారు.

దీంతో అక్క‌డ అంతా బాగానే జ‌రిగింద‌ని తెలుసుకుని.. ఇక్క‌డ ఎందుకు ప్రొటోకాల్ పాటించ‌లేద‌ని క‌లెక్ట ర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నంద్యాల జిల్లా ప‌రిధిలో నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ‌, శ్రీశైలం, నందికొట్కూరు, డోన్, బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి.

వీటిలో డోన్ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. శిలా ఫ‌ల‌కంపై ఆయ‌న పేరుతో పాటు, నంద్యాల స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా ర‌వికిశోర్ రెడ్డి పేర్లు మాత్ర‌మే ఉన్నాయి‌.

ఈ విష‌యాన్ని గ్ర‌హించిన ఆళ్ల‌గ‌డ్డ‌, శ్రీశైలం, నందికొట్కూరు, బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యేలు బ్రిజేంద్ర రెడ్డి, శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, అర్థ‌ర్‌, కాట‌సాని రామిరెడ్డిలు క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన జిలానీని నిల‌దీశారు. జిల్లా ప్రారంభోత్స‌వానికి ఆహ్వానం పంపిన త‌ర్వాత శిలాఫ‌ల‌కంపై త‌మ పేర్లు ఎందుకు చేర్చ‌లేద‌ని ప్ర‌శ్నించారు‌.

ఎమ్మెల్యేలు మూకుమ్మ‌డిగా ప్ర‌శ్నించ‌డంతో క‌లెక్ట‌ర్ నీళ్లు న‌మిలారు. త‌ర్వాత కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మంత్రి బుగ్గ‌న ఈ విష‌యం తెలుసుకుని.. శిలా ఫ‌ల‌కంపై మ‌ళ్లీ వారి పేర్లు కూడా రాయించాల‌ని.. సూచించారు. దీంతో ఎమ్మెల్యేలు అసంతృప్తితోనే వెనుదిరిగారు.