Begin typing your search above and press return to search.

తెలిసే మాట్లాడుతున్నారా స్వామీ... ?

By:  Tupaki Desk   |   4 Jan 2022 4:30 PM GMT
తెలిసే మాట్లాడుతున్నారా స్వామీ... ?
X
ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఎన్నో ప్రభుత్వాలను చూసిన అనుభవశాలి. పైగా కీలక శాఖలు నిర్వహించిన మాజీ మంత్రి. ఆయనే శ్రీకాకుళానికి ధీటైన నేత ధర్మాన ప్రసాదరావు. ఆయన తాజాగా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెత్త పన్ను మీద చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అవి ఏకంగా వైసీపీ ప్రభుత్వానికే గుచ్చుకునేలా ఉన్నాయని అంటున్నారు.

ఇంతకీ ధర్మాన ఏమన్నారు అంటే చెత్త పన్ను వంద రూపాయలు కట్టని వాళ్ళ ఇళ్ల వద్ద చెత్తను సేకరించవద్దట. వారి ఇంటి ముందే చెత్తను కుప్పగా తెచ్చి పోసేయాలట. అపుడు వారికి ఆ చెత్త కంపు అనుభవిస్తే వారికి తెలుస్తుంది అంటున్నారీ మాజీ మంత్రి గారు. చెత్త పన్ను కింద వంద రూపాయలు కట్టలేరా అంటూ ధర్మాన నిలదీస్తున్నారు.

ప్రభుత్వం మీ కోసం ఎంతో చేస్తోంది, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఆఫ్ట్రాల్ వంద రూపాయలు నెలకు కట్టమంటే ఇంత ఇదా అని మండిపడుతున్నారు. ప్రభుత్వం పధకాలను పంచాలి, మనం ప్రభుత్వానికి పన్ను కట్టకపోతే ఎలా అని ధర్మాన నీతులు చెబుతున్నారు.

నిజానికి ఏ ప్రజానీకం ప్రభుత్వాన్ని డబ్బు పంచమని అడగదు, అలాగే పన్నులు వాయించమని కోరుకోరు. స్వీటు తినిపించారని వీపు మీద కొరడా దెబ్బలు వేస్తామంటే ఎవరైనా సరే అని ఆనందంగా చెబుతారా. మరి ఇన్నేసి శాఖలు చూసిన ధర్మానకు ఈ ధర్మ సూక్ష్మం అర్ధం కాకపోవడం వింతే కదా అంటున్నారు.

పేదల విషయంలో వంద రూపాయలు కూడా ఎక్కువే. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్నారు. దానికి తోడు చెత్త పన్ను అంటే నిజంగానే బాధ కలుగుతుంది. ప్రభుత్వంతో మాట్లాడి చెత్త పన్ను లేకుండా చేయడమో లేక ఉన్న దాన్నిఏ సగానికో తగ్గించడమో చేస్తానని చెప్పాల్సిన ధర్మాన చెత్త పన్ను ఎందుకు కట్టరూ అంటూ హూంకరిస్తున్నారు సచివాలయ సిబ్బందిని చెత్త పన్ను కట్టించుకుని రండి అంటూ ఆదేశిస్తున్నారు అంటే ఆలోచించాల్సిందే మరి.

ఏది ఏమైనా ధర్మాన చేసిన ఈ కామెంట్స్ ఆయనకూ మంచివి కావు ప్రభుత్వానికీ మంచి చేయవు అన్న మాట సొంత పార్టీ నుంచే వినవస్తోంది. పన్ను కట్టమని ప్రజలను డబాయించిన ఏ ఏలికలూ చరిత్రలో గెలిచినట్లు దాఖలాలు లేవు. మరి దీన్ని గుర్తించని వారు ఇబ్బందులో పడడం ఖాయమే అంటున్నారు.