Begin typing your search above and press return to search.

ఏలూరు కోర్టులో కుర్రాడు సూసైడ్ అటెంప్ట్‌?

By:  Tupaki Desk   |   26 Oct 2015 8:20 AM GMT
ఏలూరు కోర్టులో కుర్రాడు సూసైడ్ అటెంప్ట్‌?
X
ఏలూరు కోర్టులో ఒక కుర్రాడు పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది. భ‌ర్త ఇంటి వారి వేధింపుల‌కు భార్య‌లు నానా ఇబ్బందుల‌కు గురి కావ‌టం ఖాయం. కానీ.. తాజా ఉదంతంలో భార్య త‌ర‌ఫు వారు చేసే టార్చ‌ర్ త‌ట్టుకోలేక ఆరు పేజీల సూసైడ్ లెట‌ర్ రాసి మ‌రీ ఆత్మ‌హ‌త్య‌య‌త్నం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న ఇత‌డికి సంబంధించిన వివారాల్లోకి వెళితే..

హైద‌రాబాద్ కు చెందిన ప్రేమ్ కిషోర్ అనే కుర్రాడు 2011లో ఏలూరుకు చెందిన నాగ‌లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. కొంత‌కాలం త‌ర్వాత వీరి మ‌ధ్య విభేధాలు మొద‌ల‌య్యాయి. చివ‌ర‌కు వీరి మ‌ధ్య‌నున్న విభేధాల‌తో నాగ‌ల‌క్ష్మి కిషోర్ మీద వ‌ర‌క‌ట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో.. అత‌గాడిని అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ‌లో ఉంది. క‌ట్నం ఇవ్వ‌కున్నా.. రాజీ కోసం రూ.2ల‌క్ష‌లు ఇవ్వాల‌ని భార్య త‌ర‌ఫు వారు బెదిరిస్తున్నార‌న్న‌ది కిషోర్‌ వాద‌న‌.

సోమ‌వారం కేసు వాయిదా కోసం ఏలూరు వ‌చ్చిన అత‌ను.. భార్య త‌ర‌ఫు వారుచేస్తున్న టార్చ‌ర్ భ‌రించ‌లేక‌పోతున్నాన‌ని.. త‌న త‌ల్లిని దారుణంగా అవ‌మానిస్తున్నార‌ని.. రాజీ కోసం రూ.2ల‌క్ష‌లు ఇవ్వాలంటున్నార‌ని.. త‌న‌కు అంత శ‌క్తి లేదంటూ ఆత్మ‌హ‌త్య య‌త్నం చేసుకున్నాడు. త‌న‌కు నెల‌కు రూ.4వేలు మాత్ర‌మే వ‌స్తాయ‌ని.. అయితే.. ఇదేమీ ప‌ట్టించుకోకుండా భార్య త‌ర‌ఫు వారు త‌న‌ను మాన‌సికంగా వేధిస్తున్నార‌ని.. త‌న చావుకు భార్య‌.. అత్త‌పై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు.

కోర్టు వాయిదాకు వ‌చ్చిన అత‌ను పురుగుల మందు తాగి ప‌డిపోవ‌టంతో.. అక్క‌డే ఉన్న పోలీసు కానిస్టేబుల్ గుర్తించి హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెబుతున్నారు. భ‌ర్త‌లే కాదు.. భార్య‌లు కూడా భారీగానే వేధిస్తున్నార‌న్న విష‌యం తాజా ఉదంతంతో నిరూపిత‌మైంద‌ని చెప్పొచ్చు.