Begin typing your search above and press return to search.

జంపింగ్ లతో బీజేపీ మరీ అంత చీపైపోయిందా? పరువు తీసేలా జగన్ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   2 March 2022 2:30 AM GMT
జంపింగ్ లతో బీజేపీ మరీ అంత చీపైపోయిందా? పరువు తీసేలా జగన్ వ్యాఖ్యలు
X
తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం చర్చనీయాంశం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. సరిగ్గా మూడేళ్ల క్రితం పులివెందులలోని సొంత ఇంటిలో తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యారు వైఎస్ వివేకా. ఎమ్మెల్యేగా, ఎంపీగా , ఎమ్మెల్సీగా, మంత్రిగా దాదాపు మూడు దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్నారు వివేకా. ఎంతో సౌమ్యుడిగా మంచి వ్యక్తిగా పేరున్న ఆయనను అజాత శత్రువుగా పేర్కొంటుంటారు. అప్పటి ప్రతిపక్ష నేత సొంత బాబాయి, అందులోనూ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎన్నికల పోలింగ్ కు కనీసం నెల కూడా లేని సమయంలో, చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో వైసీపీ ఉండగా.. వివేకా హత్య జరిగింది. దీంతో సహజంగానే ఇది రాజకీయ రంగు పులుముకొంది. అప్పటి అధికార టీడీపీలోని కొందరి హస్తం ఉందని, కాదు కాదు వైసీపీ వర్గపోరే కారణమని ఆరోపణలు వచ్చాయి. ఏదిఏమైనా వైఎస్ వంటి గొప్ప నేత తమ్ముడు అది కూడా పాశవిక స్థితిలో హత్యకు గురికావడం, తొలుత గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం సాగడం.. తర్వాత హత్యగా తేలడం అంతా ఓ డ్రామాగా సాగిపోయింది.

మలుపులతో సీబీఐ చేతికి..

వివేకా హత్య జరిగినప్పుడు.. అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. వివేకా దారుణ హత్య అనంతరం హైదరాబాద్ నుంచి సాయంత్రానికి పులివెందుల చేరిన జగన్ మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబంపై అప్పటి సీఎం చంద్రబాబు ఎలా కుట్రలు చేశారో వివరించారు. చంద్రబాబు సీఎంగా ఉండగానే తన అబ్బ (తాత) రాజారెడ్డి హత్యకు గురయ్యారని, ‘‘ఎవరు ఫినిష్ అవుతారో చూద్దాం’’అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించిన మరుసటి రోజే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని, బాబు సీఎంగా ఉన్నప్పడు.. తాను పాదయాత్రలో ఉండగా కోడి కత్తితో దాడి జరిగిందని ఆరోపించారు. ఏపీ పోలీసులు చంద్రబాబు చేతిలో ఉన్నందున వారితో న్యాయం జరగదని సీబీఐ విచారణ కోరారు. ఆ తర్వతా వైసీపీ అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ ఆలస్యమైంది. చివరకు కోర్టు జోక్యంతో కేసు సీబీఐ చేతిలోకి వెళ్లింది. దాదాపు రెండేళ్లుగా సీబీఐ విచారణ జరుగుతుండగా.. నిందితుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు.

ఈ క్రమంలో వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీతారెడ్డి అల్లుడు నర్రెడి రాజశేఖర్ రెడ్డిసహా పలువురి వాంగ్మూలాలు రికార్డు చేసింది. వీటిలో ఒక్కొక్కరి వాంగ్మూలంలో ఏం చెప్పారో ప్రస్తుతం వెలుగులోకి వస్తోంది. అయితే, అందరిలోనూ డాక్టర్ సునీతతో ఆమె అన్న వైఎస్ జగన్ చేసినట్లుగా నిన్న, ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తలు ఆసక్తి రేపాయి. తండ్రి వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని సునీత అన్న జగన్ ను కోరగా, ‘‘సీబీఐకిస్తే ఏమవుతుంది. అవినాష్ (కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి) బీజేపీలో చేరతాడు’’ అని జగన్ వ్యాఖ్యానించినట్లు మీడియాలో వస్తోంది. అయితే, ఇక్కడ జగన్ అన్న మాట ఎంతవరకు వాస్తవమో కాదో తెలియాల్సి ఉంది. కానీ, ఆయన బీజేపీ ప్రస్తావన చేసినట్లు ఉండడం చర్చనీయాంశం అవుతోంది.

ఎందుకంత చర్చనీయాంశం?

ఒక రాష్ట్ర సీఎం, అదికూడా అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సీఎం నోటివెంట, అదికూడా ఆయన తమ్ముడు, ఎంపీని ఉద్దేశించి ‘‘బీజేపీలో చేరతాడు’’ అనడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇది ప్రస్తుతం దేశంలో బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ ధోరణికి అద్దంపట్టేలా ఉందని చెబుతోంది. వాస్తవానికి ఇప్పుడున్న మోదీ-షా బీజేపీకి, ఒకప్పటి అడ్వానీ, వాజ్ పేయీ బీజేపీ రాజకీయ సిద్ధాంతాల పరంగా ఎంతో వ్యత్యాసం ఉందని అందరూ అంటున్నదే. చూస్తున్నదే. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బీజేపీ ఎత్తుగడలను తీవ్రంగా తప్పుబడుతూ మీడియా సమావేశంలో మండిపడిన సంగతి గుర్తుండే ఉంటుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవాల్లో మెజారిటీ రాకున్నా అక్రమ పద్ధతులను అనుసరించి అధికారంలో కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు.

ఏపీ నుంచి ఎంపీలను లాక్కుని.. లేదంటే కేసులతో బెదిరించి.. 2019 ఎన్నికల అనంతరం ఏపీలో టీడీపీకి చెందిన రాజ్య సభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ బీజేపీ లో చేరినసంగతి తెలిసిందే. జగన్ కు భయపడి వారంతట వారు బీజేపీలో చేరారా..? చంద్రబాబు పంపారా? అనేది ఇక్కడ చర్చనీయాంశమైంది. అయితే, ఎక్కువశాతం మంది బీజేపీనే తమ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అవసరార్థం వారిని పార్టీలో చేర్చుకుందని విమర్శలు వచ్చాయి. అంతేకాక బెంగాల్ లోనూ అధికారం కోసం సువేందు అధికారిని పార్టీలోకి తీసుకోవడం, అంతకుముందు కూడా పలు రాష్ట్రాల్లో ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంతో బీజేపీ మూల సిద్ధాంతం ఏమైందన్న ప్రశ్నలు తలెత్తాయి.

అన్నిటికి మించి కేసులను బూచిగా చూపి సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ఉసిగొల్పుతుందని, ప్రత్యర్థి పార్టీ నేతలను తమ వలలోకి లాక్కుంటుందని బీజేపీ అధిష్ఠానంపైవిమర్శలున్నాయి. మాట వినకుంటే తమిళనాడులో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు ఎలాంటి గతి పట్టించారో చూశాం.

మహారాష్ట్ర లో పలువురు నేతలకు కూడా బీజేపీలో చేరాక కేసుల నుంచి ఉపశమనం లభించిందని.. స్వయంగా అక్కడి నేతలే చెప్పడం గమనార్హం. కాగా, ఇప్పుడు ఏపీ సీఎం జగన్.. డాక్టర్ సునీతతో అన్నట్లుగా వస్తున్న మాటలు.. ‘‘కేసుల బూచి చూపి ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరేలా చేస్తోంది’’అనే విమర్శకు బలం చేకూరుస్తోంది. ఏదేమైనా.. జగన్ వ్యాఖ్యలు బీజేపీ పరువు తీసేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.