Begin typing your search above and press return to search.

ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోండి: తుఫాన్‌ - క‌రోనాపై విస్తృత సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌

By:  Tupaki Desk   |   4 May 2020 6:44 PM IST
ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోండి: తుఫాన్‌ - క‌రోనాపై విస్తృత సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌
X
కరోనా వైర‌స్‌ తో రాష్ట్రంలో ఇప్ప‌టికే క‌ల్లోల ప‌రిస్థితులు ఏర్ప‌డుతుంటే ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పై తుఫాన్ రూపేణ మ‌రో ముప్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోమ‌వారం స‌మీక్ష చేశారు. అధికారులు, - మంత్రులతో స‌మావేశ‌మై క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు - మ‌ద్యం విక్ర‌యాలు, -లాక్‌ డౌన్ అమ‌లు అంశాల‌పై చ‌ర్చిస్తూనే ఇటు తుఫాన్‌పై కూడా స‌మగ్రంగా చ‌ర్చించారు. వీటితో పాటు వ‌ల‌స కార్మికుల త‌ర‌లింపు.. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను తీసుకురావ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు వంటి వాటిపై స‌మావేశంలో తీవ్రంగా స‌మాలోచ‌న‌లు చేశారు.

క‌రోనా పాజిటివ్ కేసులతో పాటు రాష్ట్రానికి పొంచి ఉన్న ఎంఫాన్ తుఫాన్‌ పై అధికారుల‌తో మాట్లాడారు. తీర ప్రాంతాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. తుఫాన్‌ పై నిరంత‌రం స‌మీక్షిస్తూ కావాల్సిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశించారు. ఎంఫాన్‌ తుపాను రాష్ట్రం వైపు వస్తే సిద్ధంగా ఉండాలని చెప్పారు. తుపాను కదలికలను గమనిస్తూనే విద్యుత్‌ - రెవెన్యూ, -పౌరసరఫరాలు - వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్‌ తో ఆస్తి, -ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని - ఎవ‌రూ సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలని చెప్పారు.

ధాన్యం కొనుగోలును కూడా వేగవంతం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ధాన్యం సేకరణలో అగ్రెసివ్‌ గా ఉండాలని - కల్లాల్లో ఉన్న ధాన్యం వీలైనంతవరకూ కొనుగోలు చేయాలని అధికారుల‌కు ఆదేశించారు. వర్షాలతో దెబ్బతినడానికి అవకాశం ఉన్న పంటల సేకరణలో వేగం పెంచాలని సూచించారు. ఇక క‌రోనా వైర‌స్‌ పై కూడా చ‌ర్చించారు. రోజురోజుకి వైర‌స్ కేసులు పెరుగుతూనే ఉన్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రెడ్‌ జోన్లలో ఉన్న ఆస్ప‌త్రుల్లో కచ్చితమైన మెడికల్‌ ప్రొటోకాల్‌ పాటించాలని సీఎం అధికారులను ఆదేశించారు. క‌రోనా పరీక్షల వివ‌రాల‌ను అధికారులను అడిగి తెలుసుకున్నారు. టెస్టులు పెంచి క‌రోనా క‌ట్ట‌డికి కృషి చేయాల‌ని వైద్యారోగ్య శాఖ‌ల‌తో పోలీస్ అధికారుల‌కు సూచించారు.

అనంత‌రం టెలి మెడిసిన్‌ - వలస కూలీలు, -యాత్రికుల అనుమతిపై చ‌ర్చించారు. విప్ల‌వాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన టెలి మెడిసిన్‌ వ్వవస్థ బలోపేతం కావాలని సీఎం జ‌గ‌న్‌ సూచించారు. వలస కూలీలు, -ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయినా యాత్రికులు - విద్యార్థులు - గ్రూపులకు అనుమతి ఇస్తామని తేల్చిచెప్పారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారమే వ‌ల‌స కార్మికుల‌ను అనుమ‌తించాల‌ని, ముఖ్యంగా వెబ్‌ సైట్‌ ద్వారా అప్లై చేసుకున్న వారిని పరిశీలించి తర్వాత ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి వారికి అవకాశం కల్పిద్దామ‌ని పేర్కొన్నారు.