Begin typing your search above and press return to search.

ఏపీలో రూపాయికే వాటిని ఇచ్చేస్తారట

By:  Tupaki Desk   |   8 March 2020 12:20 PM IST
ఏపీలో రూపాయికే వాటిని ఇచ్చేస్తారట
X
స్కూల్ చదువుకునే యుక్త వయసు అమ్మాయిలకు నెలసరి పెద్ద సమస్య. నగరాలు.. పట్టణ ప్రాంతాల్లో అయితే ఫర్లేదు కానీ గ్రామీణ ప్రాంతాలకు చెందిన అమ్మాయిలకు శానిటరీ నాప్ కిన్స్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. బహిరంగ మార్కెట్లో అధిక ధరలతో ఉండటం.. వాటిని కొనుగోలు చేసే స్తోమత లేని కారణంగా.. పలు పద్దతుల్ని ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి తీరుతో తరచూ అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటుంటారు.

ఈ సమస్యను గుర్తించిన ఏపీలోని జగన్ సర్కార్ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో శానిటరీ నాప్ కిన్స్ వెండింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. తొలుత కొన్ని స్కూళ్లలో ఏర్పాటు చేసి.. అనంతరం దశల వారీగా వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో ఏర్పాటు చేసేలా చేయనున్నారు.

ప్రఖ్యాత ఎఫ్ఎంజీ హిందుస్తాన్ లీవర్ (యూని లీవర్ గా ఆ మధ్యన మార్చారు) కంపెనీ సహకారంతో ఈ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం చేపట్టిన ఈ పథకాన్ని.. రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటికే కేంద్రంతో సంప్రదింపులు షురూ చేశారు.

ఈ వెండింగ్ మిషన్లో రూపాయి వేస్తే చాలు.. శానిటరీ నాప్ కిన్ వచ్చే ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి కేంద్రం ఏర్పాటు చేసిన జనఔషధి దుకాణాల్లో ఈ నాప్ కిన్స్ నురూ.10 అమ్ముతున్నారు. వాటి ధరల్ని కేంద్రం తగ్గించనగా.. ఏపీ సర్కారు దాన్ని రూపాయికే స్కూల్ విద్యార్థినులకు అందజేయాలని నిర్ణయించింది.

ఈ ఏడాది ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరానికి కొన్ని ప్రభుత్వ పాఠశాల్లలో ఈ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న హిందుస్తాన్ లీవర్ లిమిటెడ్ లైఫ్ కేర్ నుంచి అవసరమైన యంత్రాల్ని తీసుకొచ్చే ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఈ పథకం వాస్తవ రూపం దాలిస్తే.. స్కూల్ అమ్మాయిలకు.. వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పకతప్పదు.