Begin typing your search above and press return to search.

తుది శ్వాస వ‌ర‌కూ జగన్ కే మద్దతిస్తా:పృథ్వీరాజ్‌

By:  Tupaki Desk   |   10 Sep 2018 5:30 PM GMT
తుది శ్వాస వ‌ర‌కూ జగన్ కే మద్దతిస్తా:పృథ్వీరాజ్‌
X
ఏపీలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంకల్ప యాత్ర‌కు జ‌నం నీరాజనాలు ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. దీంతోపాటు, తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి కూడా చాలామంది జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. పోసాని కృష్ణ‌ముర‌ళి - క‌మెడియ‌న్ పృథ్వీ రాజ్ లు పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ను క‌లిసి త‌మ మ‌ద్దతు తెలిపారు. రాబోయే ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపు ఖాయ‌మ‌ని, జ‌గ‌నే కాబోయే సీఎం అని థ‌ర్టీ ఈయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ ప‌లుమార్లు ఘంటాప‌థంగా చెప్పారు. తాజాగా, మ‌రోసారి జ‌గ‌న్ పై పృథ్వీ ప్ర‌శంస‌లు కురిపించారు. జ‌గ‌న్ దేవుడని ఆయన సిద్ధాంతమే తన సిద్ధాంతమని పృథ్వీ పేర్కొన్నారు. తన ఊపిరి ఆగేవరకు జగన్‌ వెంట నడుస్తానని ఆయ‌న చెప్పారు. నెల్లూరు పురమందిరంలో ఆదివారం రాత్రి కళాంజలి సాంస్కృతిక సంస్థ, కళాంజలి కామెడీక్లబ్‌–నెల్లూరు ఆధ్వర్యంలో సినీ ‘హాస్యచక్రవర్తి’ టీవీ రమణారెడ్డి స్మారక అవార్డును పృథ్వీ అందుకున్నారు.

పృథ్వీరాజ్ కు రమణారెడ్డి స్మారక అవార్డును నెల్లూరు సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు అంద‌జేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పృథ్వీ జ‌గ‌న్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. మాట‌త‌ప్ప‌ని మ‌డ‌మ‌తిప్ప‌ని జ‌న‌నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న‌యుడు జ‌గ‌న్ రాబోయే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి సీఎం అవుతార‌ని పృథ్వీ అన్నారు. త‌న తుదిశ్వాస వ‌ర‌కు జ‌గ‌న్ వెంట న‌డుస్తాన‌న్నారు. తాను జగన్ కు మద్దతుపలికినందుకు ఎన్నో బెదిరింపులు వచ్చాయని, వాటికి తాను భయపడబోనని చెప్పారు. జగన్ లా తనకూ గుండె ధైర్యమెక్కువని ఆయ‌న అన్నారు. త‌న `థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ` డైలాగ్‌ను సీఎం చంద్రబాబు కాపీకొట్టి ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ` డైలాగ్‌ చెబుతున్నారని పృథ్వీ ఎద్దేవా చేశారు. ఎందరో కళాకారులకు - నటులకు జన్మనిచ్చిన నెల్లూరులో హాస్యనట చక్రవర్తి టీవీ రమణారెడ్డి అవార్డును అందుకోవడం తన అదృష్టమన్నారు. తనకు అవార్డు అందచేసిన కళాంజలి సంస్థ నిర్వాహకుడు అనంత్‌కు పృథ్వీరాజ్‌ కృతజ్ఞతలు తెలిపారు.