Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ 'కాఫీ' మంత్రం.. అధికారుల మ‌ధ్య స‌మ‌న్వ‌యానికే...!

By:  Tupaki Desk   |   27 Aug 2019 3:48 PM GMT
జ‌గ‌న్ కాఫీ మంత్రం.. అధికారుల మ‌ధ్య స‌మ‌న్వ‌యానికే...!
X
ఏ ప్ర‌భుత్వానికైనా పాల‌న ముఖ్యం. ప్ర‌జ‌లకు ఇచ్చిన హామీల‌ను ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో పేర్కొన్న మేనిఫెస్టోను అమ‌లు చేసే క్ర‌మంలో ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా.. ఎన్ని ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టినా.. క్షేత్ర స్థాయిలో ప్ర‌జ‌ల‌కు అందించేది మాత్రం అధికారులే. ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. నేరుగా ముందు తెలిసేది అదికారుల‌కే. ఆ త‌ర్వాతే ప్ర‌భుత్వం దృష్టికి వెళ్తుంది. అది పోలీసు అయినా - రెవెన్యూ అయినా.. పౌర‌ స‌ర‌ఫ‌రాలైనా.. మ‌రెవ‌రైనా కూడా అధికారుల‌కే ముందు ఆయా స‌మ‌స్య‌లు తెలుస్తాయి.

అయితే, ఆయా విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ముందుకు వెళ్తేనే ప‌నులు జ‌రుగుతాయి. దీంతో ప్ర‌భుత్వానికి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గిపోవ‌డంతోపాటు ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ఫ‌లాలు, సంక్షేమం వంటివి అందుతాయి. ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసుకున్న వారు ఎంత దూర దృష్టితో ఆలోచించినా.. ప్ర‌జ‌ల‌కు ఎన్ని మేలైన ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టినా.. అవి క్షేత్ర‌స్థాయిలో అందించే అధికారుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక పోతే.. అడుగ‌డుగునా.. కీచులాట‌లు - ఇగోల‌కు పోతే.. ప్ర‌జ‌లు న‌ష్టపోతారు. అంతిమంగా ఆ ప్ర‌భావం ప్ర‌భుత్వాల‌పైనా.. ప్ర‌భుత్వ అధినేత‌ల‌పైనా.. ఆ త‌ర్వాత ఆయా పార్టీల‌పైనా ఉంటుంది.

గ‌తంలో ఈ త‌ర‌హా ప‌రిస్థితిని మ‌న రాష్ట్రంలోనూ చూశాం. అధికారుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం గ‌త సీఎం చంద్ర‌బాబు కూడా నెత్తీ నోరూ బాదుకున్నారు. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ఉండాల‌ని, ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌రాద‌ని ఆయ‌న అనేక మార్లు సూచించారు. దిశానిర్దేశం చేశారు. క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సుల్లో అనేక మార్లు చంద్ర‌బాబు ఈ విష‌యాన్నే చెప్పుకొచ్చారు. ప్ర‌ధానంగా రెవెన్యూ, పోలీసు డిపార్ట్ మెంట్ అధికారుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోతే.. ప్ర‌జ‌లు ప‌డే తిప్ప‌లు అన్నీ ఇన్నీ కావు. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారుల మ‌ధ్య స‌మ‌న్వ‌యానికి కొత్త సూత్రం తెర‌మీదికి తెచ్చింది.

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కాఫీ టుగెదర్‌ కార్యక్రమం పేరుతో ప్రతివారం కలుసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. తద్వారా అధికారుల మధ్య సమన్వయం కుదిరి భూవివాదాల పరిష్కారానికి అవకాశముంటుందని అన్నారు. ప్రతి మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘కాఫీ టుగెదర్‌’ కార్యక్రమం పేరుతో కలుసుకోవాలి అని జ‌గ‌న్ సూచించారు. అదే స‌మ‌యంలో వ‌చ్చామా-వెళ్లామా అనే విధంగా ఈ కాఫీ టుగెద‌ర్‌లు ఉండ‌రాద‌ని కూడా జ‌గ‌న్ హెచ్చ‌రించారు. కాఫీ టుగెద‌ర్‌కు వ‌చ్చి రెండు బిస్కెట్లు క‌రా క‌రా న‌మిలేసి.. గుక్కెడు కాఫీని గొంతులో పోసుకుని ఫొటోల‌కు ఫోజులిచ్చి వెళ్తే.. ఉప‌యోగం ఉండ‌ద‌ని చెప్పారు.

భూవివాదాలకు సంబంధించిన జాబితా ఇచ్చి పుచ్చుకోవాల‌ని, ఈ జాబితాను తహశీల్దార్లకు బుధవారం పంపాలలని.. ఇక‌, గురువారం తహశీల్దార్ - ఎస్సై -సర్వేయర్ - ఆర్‌ ఐ - వీఆర్వోలు కలిసి కూర్చోవాల‌ని సూచించారు. భూవివాదాల పరిష్కారంపై దృష్టి పెట్టాల‌న్నారు. చాలా చోట్ల భూవివాదాలు శాంతి భద్రతల సమస్యగా మారాయ‌ని అన్నారు. ఇలాంటి వాటిని ప‌రిష్క‌రించ‌డంతోపాటు కొత్త స‌మ‌స్య‌లు రాకుండా ఉండేందుకు అధికారులు చ‌ర్చించేందుకు ఈ కాఫీ టుగెద‌ర్‌లు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని అన్నారు. మొత్తానికి అధికారుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం జ‌గ‌న్ చేసిన సూచ‌న‌ల అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచెత్తింది.