Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా మ‌ర్డ‌ర్ కేసు.. దేవిరెడ్డికి కోర్టు షాక్!

By:  Tupaki Desk   |   1 Aug 2022 10:31 AM GMT
వైఎస్ వివేకా మ‌ర్డ‌ర్ కేసు.. దేవిరెడ్డికి కోర్టు షాక్!
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డిని మార్చి 15, 2019న హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి బెయిల్‌ మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆగ‌స్టు 1న‌ నిరాకరించింది. దీంతో ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి, త‌న హ‌త్యలో దోషులెవ‌రో తేలాల‌ని కోరుతున్న వివేకా కుమార్తె సునీత‌కు మంచి పట్టు ల‌భించిన‌ట్ట‌యింద‌ని చెబుతున్నారు.

వివేకా హ‌త్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాద‌వ్ (ఎ1), ఉమాశంక‌ర్ రెడ్డి (ఎ2), దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి (ఎ3)ల బెయిల్ పిటిష‌న్ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. వారు బయ‌టికొస్తే సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తార‌న్న సీబీఐ న్యాయ‌వాదుల వాద‌న‌కే కోర్టు మొగ్గు చూపింది. ఈ నేప‌థ్యంలో వారి బెయిల్ పిటిష‌న్ల‌ను కొట్టివేసింది.

కాగా అంతకుముందు వీరికి బెయిల్ మంజూరు చేసేందుకు కడప కోర్టు నిరాకరించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ ఏడాది జూన్‌లో నిందితులు ముగ్గురు ఈ కేసులో బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టు గుమ్మం తొక్కారు. అయితే వైఎస్ వివేకా మ‌ర్డ‌ర్ కేసును విచారిస్తున్న సీబీఐ వీరి బెయిల్ పిటిష‌న్ ను తీవ్రంగా వ్య‌తిరేకించింది. ఇప్ప‌టికే కేసు విచార‌ణ ద‌శ‌లో ఉంద‌ని.. ఇలాంటి ప‌రిస్థితుల్లో నిందితుల‌కు, ముఖ్యంగా దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి బెయిల్ ఇస్తే వారు సాక్షుల‌ను బెదిరిస్తార‌ని.. వారి ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని సీబీఐ గ‌ట్టి అభ్యంత‌రం తెలిపింది.

ప్రాసిక్యూషన్, నిందితుల వాదనలు విన్న హైకోర్టు వారి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. వీరి కేసులను ప్రముఖ న్యాయవాది, రాజ్య‌స‌భ స‌భ్యుడు, ఆచార్య నిర్మాత‌ నిరంజన్ రెడ్డి వాదించారు.

మ‌రోవైపు ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలంలో శివశంకర్ రెడ్డికి ఆ నేరంలో ప్రమేయం ఉన్నట్లు రుజువులు లేవని నిందితుల తరఫు న్యాయవాది నిరంజ‌న్ రెడ్డి వాదించారు. వివేకానందరెడ్డిని హత్య చేసేందుకు దస్తగిరి కోటి రూపాయలు తీసుకున్నాడని, తానే హత్యాయుధాన్ని కొనుగోలు చేశానని చెప్పాడ‌ని నిరంజ‌న్ రెడ్డి గుర్తు చేశారు.

హత్యానంతరం జరిగిన ఘటనలకు శివశంకర్ రెడ్డిని బాధ్యులను చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంద‌ని నిరంజ‌న్ రెడ్డి ఆరోపించారు. హత్యలో తన పాత్ర ఉంటే మరుసటి రోజు వివేకా ఇంటికి ఎందుకు వస్తార‌ని ప్ర‌శ్నించారు. సీబీఐ ఇత‌ర సంఘ‌ట‌న‌ల‌ను కూడా దేవిరెడ్డి శివశంక‌ర్ రెడ్డికి ఆపాదించే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని చెప్పారు.

శివ‌శంక‌ర్ రెడ్డి పాత్రపై ఇప్పటికే దర్యాప్తు పూర్తయి, సీబీఐ రెండు చార్జిషీట్లు దాఖలు చేసింద‌ని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ నేప‌థ్యంలో శివశంకర్ రెడ్డిని జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచడం సరికాదని వాదించారు. ఆయ‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరారు. అయితే న్యాయ‌స్థానం బెయిల్ పిటిష‌న్ల‌ను తోసిపుచ్చింది.