Begin typing your search above and press return to search.

ఏపీని దాటనున్న వివేకా కేసు : ఆరు నెలలలో తేల్చేయనున్న సీబీఐ!

By:  Tupaki Desk   |   19 Oct 2022 5:42 PM GMT
ఏపీని దాటనున్న వివేకా కేసు : ఆరు నెలలలో తేల్చేయనున్న సీబీఐ!
X
ఏపీని దాటనుంది అత్యంత కీలకమైన కేసు. అదే మాజీ మంత్రి వైఎస్ వివేకాంద రెడ్డి దారుణ హత్య కేసు. ఈ కేసు విషయంలో ఏపీలో దర్యాప్తు అయితే ఎప్పటికీ పూర్తి కాదు, అసలు దోషులకు శిక్ష పడదు అన్న నిర్ణయానికి వచ్చిన వైఎస్ వివేకా కూతురు సునీత పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయలని సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ మీద విచారణ జరిగింది. ఈ కేసులో సాక్ష్యులను బెదిరించడంతో పాటు లోకల్ పోలీసుల నుంచి సరైన సహకారం లభించడం లేదని పేర్కొంది.

దీని మీద లోకల్ ఎంపీ నుంచి తీవ్ర వత్తిడులు ఉన్నాయని కూడా ఆరోపించింది. ఇక సుప్రీం కోర్టు సునీత దాఖలు చేసిన పిటిషన్ మీద సీబీఐ ని పిటిషన్ దాఖలు చేయమని కోరింది. సునీత చెప్పిన అన్ని అంశాలతో ఏకీభవిస్తూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు తీవ్ర జాప్యం కావడం వెనక పోలీసుల నాన్ కోపరేషన్ తో పాటు రాజకీయ పలుకుబడి వంటి అనేక అంశాలను సునీత పిటిషన్ లో పేర్కొన్న విషయాలను సీబీఐ తన పిటిషన్ లో ప్రస్థావించింది.

ఈ కేసు ఇంతలా విచారణలో జాప్యం కావడానికి ఇవే కారణాలు అని సుప్రీం కోర్టుకు సీబీఐ పేర్కొంది. దాంతో ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం మీద సీబీఐ కూడా సుముఖత వ్యక్తం చేసింది. అయితే సునీత తరఫున న్యాయవాదులు తెలాంగాణ రాష్ట్రానికి బదిలీ చేసినా అభ్యంతరం లేదని చెప్పగా సీబీఐ మాత్రం తెలంగాణా తప్ప మరెక్కడ అయినా అన్నట్లుగా పేర్కొంది.

ఇక ఈ విషయంలో సాక్ష్యులకు భద్రత కల్పించడంతో ఏపీ సర్కార్ తరఫున చెప్పిన వివరాలను కూడా సుప్రీం కోర్టు అడిగి తెలుసుకుంది. వన్ ప్లస్ వన్ భద్రత కల్పిస్తున్నారు అన్న దానికి ఆధారాలేంటి అని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులను ప్రశ్నించడం విశేషం. వాటికి సంబంధించిన అధారాలను వెంటనే తీసుకుని కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలని ఆదేశించింది.

మరో వైపు నిందితులు శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి తరౌన న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ తమ క్లయింట్ల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని కోర్టుకు నివేదించారు. సాక్ష్యులను ఎవరూ బెదిరించడం లేదని, పైగా విచారణ త్వరగా విచారణ సాగాలని పిటిషనర్లు కోరుతున్నారని పేర్కొన్నారు.

ఇక ఈ కేసు విచారణకు ఎంత సమయం కావాలని సీబీఐ కోర్టుని సుప్రీం కోర్టు ప్రశ్నించగా ఆరు నెలల సమయం ఇస్తే విచారణ పూర్తి చేస్తామని పేర్కొంది. దాంతో అన్ని వివరాలతో పూర్తి తీర్పుని ఈ శుక్రవారం తెలియచేస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం వెల్లడించింది. దాంతో వివేకా హత్య కేసులో ఈ శుక్రవారం సుప్రీం కోర్టు నుంచి కీలక తీర్పు రావచ్చు, అలాగే ఏ రాష్ట్రానికి ఈ కేసుని బదిలీ చేస్తారో కూడా కోర్టు ఆ రోజే తెలియచేయనుంది అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.