Begin typing your search above and press return to search.

వైఎస్సార్ 60 అడుగుల విగ్రహం.. ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   3 Sep 2021 11:44 AM GMT
వైఎస్సార్ 60 అడుగుల విగ్రహం.. ఎక్కడంటే?
X
జనం కోసం, ఇచ్చిన మాట మీద నిలబడి, జనహితమే తన ప్రథమ కర్తవ్యంగా భావించే నాయకులు జనం గుండెల్లో ఎప్పటికీ అలా స్థిరంగా నిలిచిపోతారు. అలాంటి వారిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. ప్రతి పక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా వైఎస్సార్ ప్రజల మనిషి అనిపించేలా తన ప్రస్థానాన్ని సాగించారు. జనం కష్టసుఖాలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజలు, రైతుల కష్టాలు చూసి వారికి అండగా నిలబడ్డారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి ఎంతో నిజాయతీగా, నిబద్ధతతో కృషి చేసిన వ్యక్తి వైఎస్సార్. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం కల అనుకుంటే, ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి వారి కలను నిజం చేశారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని ఫీజు రీయింబర్స్ మెంట్ వరం కల్పించిన ఘనత వైఎస్సార్‌ కు దక్కింది.

సీఎంగా రెండో పర్యాయం ఎన్నికైన తర్వాత రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి చిత్తూరు జిల్లాకు వెళుతూ, నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాలగుట్ట దగ్గర జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఆయన మరణం తర్వాతా తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సాఆర్ విగ్రహాలు ఎన్నో వెలిశాయి. తాజాగా దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 60 అడుగుల విగ్రహాన్ని చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ వీరాభిమాని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వైఎస్సార్‌ విగ్రహాల్లో ఇదే ఎత్తయినది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని వైయస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా దండపల్లి నాలుగురోడ్ల కూడలిలో ఏర్పాటు చేశారు.

పలమనేరుకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు సి.వి కుమార్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ పై ఉన్న అభిమానంతో 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైయస్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ విగ్రహావిష్కరణ సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించాలని సి.వి కుమార్ అనుకున్నారు. అది వీలు కాకపోవడంతో వైఎస్ అభిమానితోనే ఆవిష్కరించారు. తమిళనాడుకు చెందిన కాళీశ్వరన్‌ తొమ్మిది నెలలు కష్టపడి ఈ విగ్రహాన్ని రూపొందించారు. కాగా, ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడతోపాటు, స్థానిక వైసీపీ నేతలు కూడా హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. పలమనేరులో గత కొన్ని రోజులుగా వైసీపీలో ఉన్న వర్గపోరు కారణంగానే జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు పార్టీ చర్చ జరుగుతుంది.