Begin typing your search above and press return to search.

ఏపీ విభజనపై వైసీపీ ముఖ్య నేత సజ్జల సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   8 Dec 2022 9:30 AM GMT
ఏపీ విభజనపై వైసీపీ ముఖ్య నేత సజ్జల సంచలన వ్యాఖ్యలు!
X
ఆంధ్రప్రదేశ్‌ విభజనపై వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి కలసి ఉండాలన్నదే తమ పార్టీ విధానమని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

సమైక్య రాష్ట్రాన్ని వైసీపీనే గట్టిగా కోరుకుందని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. తాము ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రానికే మద్దతు ఇస్తామని తెలిపారు. కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే తమ విధానమని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ కలవడానికి ఏ వేదిక దొరికినా తమ పార్టీ, తమ ప్రభుత్వం దానికే ఓటు వేస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ, ఇప్పుడది సాధ్యమయ్యే పనేనా అని సజ్జల వ్యాఖ్యానించారు.

తాజాగా రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే జగన్‌పై ఉండవల్లి అరుణ్‌ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. సీఎం జగన్‌ ఏపీ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని.. రాష్ట్ర ప్రయోజనాలను వదిలేశారని.. ఇలా అయితే జగన్‌ రాజకీయంగా గట్టి దెబ్బతినడం ఖాయమని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ డిసెంబర్‌ 7న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా రాష్ట్ర విభజన గురించి వదిలేయండని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందంటూ ఉండవల్లి ఆరోపించారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ అఫిడివిట్‌ వేశారని నిలదీశారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడటానికి జగన్‌ ఎందుకు భయపడుతున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. పోరాటం చేసే జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కోసం పోరాటం చేయకపోతే జగన్‌ రాజకీయ జీవితం ఇంతటితో ముగిసినట్లేనని అన్నారు.

ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన సజ్జల.. జగన్‌ ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసమే పోరాడుతున్నారన్నారు. అందుకోసం వచ్చిన ఏ అవకాశాన్నీ తాము వదులుకోబోమన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.