Begin typing your search above and press return to search.

వైసీపీ మంత్రుల వేడి నిట్టూర్పులు..?

By:  Tupaki Desk   |   20 March 2022 6:30 AM GMT
వైసీపీ మంత్రుల వేడి నిట్టూర్పులు..?
X
అధికారంతముల కాలం సమీపించిందా. లేక తమకు చాన్స్ ఇక దక్కదు అని అనిపించిందా. ఏమో కానీ వైసీపీ మంత్రులు పలువురు అయితే డల్ అయినట్లుగానే కనిపిస్తున్నారు. అవును అధికారంలో ఉంటే ఆ దర్జావే వేరు. ఆ హడావుడే వేరు. కానీ జగన్ నాడు చెప్పిన మాట ప్రకారం సగం పాలన పూర్తి కాగానే తప్పిస్తాను అంటున్నారు.

నిజానికి అలా అనుకుంటే 2021 డిసెంబర్ 8తోనే రెండున్నరేళ్ల కాలం పూర్తి అయిపోయింది. కానీ ఎందుకో తెలియదు కానీ జగన్ కంటిన్యూ చేశారు. అలా ఇప్పటిదాకా జరుగుతున్న అధికార వైభోగం అంతా బోనస్ గానే చూడాలి. సరే ఇలాగే మరింతకాలం గడచిపోతుంది, కాలమలాగే ఆగిపోవాలి, అలా జరిగిపోవాలి అనుకున్నారేమో తెలియదు కానీ జగన్ స్వయంగా మంత్రివర్గ విస్తరణ చెప్పేసరికి ఉలిక్కిపడుతున్నారుట చాలా మంది.

ఇక ఏ క్షణాన అయినా మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది అంటున్నారు. డేట్ టైం జగన్ ఫిక్స్ చేస్తారు. ఇక కొత్త మంత్రుల జాబితాలో పాత వారు తొంబై శాతం పైగా ఉండరు అన్నది తెలిసిపోతోంది. ఇప్పటిదాకా చూసుకుంటే బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని తప్ప అంతా అవుట్ అని అంటున్నారు.

దాంతో మిగిలిన మంత్రులు బాగా నీరసపడుతున్నారు. గతంలో వాడిగా వేడిగా మాట్లాడిన వారు కూడా ఇపుడు ఎందుకీ గోల అనుకుంటున్నారుట. ఇక నెల్లూరుకి చెందిన ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ అయితే మీడియా ముందుకు వచ్చినా ముక్తసరిగా మాట్లాడివెళ్తున్నారు. ఈ మధ్యనే పవన్ ఆవిర్భావ సభ జరిగింది. పవన్ అయితే వైసీపీ మీద చాలానే మాట్లాడరు.

దానికి అనిల్ కౌంటర్ స్పెషల్ గా ఎపుడూ ఉంటూ వచ్చింది. ఈసారి ఆ ముచ్చటేలేదు. అంటే ఆయన డల్ అయ్యారని అంటున్నారు. ఇదే తీరున చాలా మంది మంత్రులు నిట్టూర్పులు విడుస్తున్నారు అని అంటున్నారు. దాంతో వారు ఎవరూ తమ శాఖ మీద దృష్టి పెట్టలేకపోతున్నారు అని అంటున్నారు. ఇక అనిల్ లాంటి వారు అయితే కీలకమైన జలవనరుల శాఖను చేపట్టారు. తన హయాంలో పోలవరం పూర్తి అవుతుంది అని మొదట్లో అనుకున్నా అది జరగలేదు. ఇక నెల్లూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కూడా తాను మంత్రిగా ఉండగా పూర్తి అవుతాయనుకున్నా అదీ జరగలేదు.

దాంతో అలాంటి అసంతృప్తితో పాటు రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. మాజీగా ఎలా ఎదుర్కోవాలన్న ఆలోచనలలో చాలా మంది ఉన్నారు. దానికి తోడు జిల్లా ప్రెసిడెంట్ కిరీటాలు కూడా పెడతామంటున్నారు. అది బరువు బాధ్యతలతో కూడుకున్నది కావడంతో మాకెందుకు ఆ పదవులు అని కూడా గొణుక్కుంటున్నారుట. ఏది ఏమైనా వైసీపీ మంత్రులు మాత్రం వేసవి వేడి నిట్టూర్పులతో వడగాలులనే సృష్టిస్తున్నారు అని అంటున్నారు.