Begin typing your search above and press return to search.

కేసీఆర్ దేవుడు అంటున్న వైసీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   14 Nov 2017 3:30 PM GMT
కేసీఆర్ దేవుడు అంటున్న వైసీపీ ఎమ్మెల్యే
X
రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలుగు రాష్ర్టాల్లోని ప‌రిణామాల‌పై స‌హ‌జంగానే అంద‌రి దృష్టి నెల‌కొంటుంది. ఒక రాష్ట్రంలో జ‌రుగుతున్న తీరుపై మ‌రో రాష్ట్రం వారు స‌హ‌జంగానే ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. అందులోనూ అసెంబ్లీ స‌మావేశాల వంటి కీల‌క‌మైన విష‌యాల్లో అయితే ఆ ఆస‌క్తి వేరే. అలాంటి ఆస‌క్తి కార‌ణంగానే తెలంగాణ అసెంబ్లీలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. తెలంగాణ శాసనసభ స‌మావేశాలు జ‌రుగుతున్న సంద‌ర్భంగా ఏపీకి చెందిన సంతనూతలపాడు వైఎస్ ఆర్‌ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలం సురేష్ వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చ‌టించారు.

ఏపీలో త‌మ అసెంబ్లీకి వెళ్లి టైం వృథా అవుతోంద‌ని...త‌మ‌కు మాట్లాడేందుకు 5 నిమిషాలు కూడా మైక్ ఇవ్వడం లేద‌ని ఎమ్మెల్యే సురేశ్ వాపోయారు. తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం లభిస్తోందని, చర్చలు బాగా సాగుతున్నాయని ఎమ్మెల్యే సురేశ్‌ తెలిపారు. ఇక్కడ కేసీఆర్ దేవుడు అని ప్ర‌శంసించారు. శీతాకాల సమావేశాలు ఇన్ని రోజులు జరుపుతున్నారని ఇది అభినంద‌నీయ‌మ‌న్నారు. ఏపీలో బడ్జెట్ సమావేశాలే 14 రోజులు దాటనివ్వడం లేద‌ని సురేశ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ‌లో ప్రతిపక్షంగా కాంగ్రెస్ చాలా బ‌ల‌హీనంగా ఉందని ఎమ్మెల్యే సురేశ్ అన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్నిటిని తట్టుకుని వైసీపీ బలమైన ప్రతిపక్షంగా నిలబడుతోందని సురేశ్ ప్ర‌శంసించారు. టీడీపీలో చేరుతున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు నేరుగా సొమ్ములు ఇవ్వ‌డం లేద‌ని సురేశ్ వివ‌రించారు. కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్‌ ను వాళ్లకు చేరవేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా బాబు ప్రభుత్వ సొమ్మే ఖర్చు పెట్టాడని విమ‌ర్శించారు. కాగా, వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు వాస్త‌వ ప‌రిస్థితులకు అద్దం ప‌ట్టేలాగా ఉన్నాయ‌ని తెలంగాణ ఎమ్మెల్యేలు చ‌ర్చించుకోవ‌డం క‌నిపించుకుంది.