Begin typing your search above and press return to search.

అసంతృప్తే ప్ర‌భుత్వ విప్ ప‌ద‌వి ద‌క్కేలా చేసిందా?

By:  Tupaki Desk   |   20 July 2022 8:30 AM GMT
అసంతృప్తే ప్ర‌భుత్వ విప్ ప‌ద‌వి ద‌క్కేలా చేసిందా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అన‌కాప‌ల్లి జిల్లా చోడ‌వ‌రం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీకి ప్ర‌భుత్వ విప్ ప‌ద‌వి ల‌భించింది. ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీ అన‌కాప‌ల్లి జిల్లా అధ్య‌క్షుడిగా కూడా ఉన్న ధ‌ర్మ‌శ్రీని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ విప్ గా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్ రెండో విడ‌త మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ధ‌ర్మ‌శ్రీ పేరు బాగా విన‌ప‌డ్డా ఆయ‌న‌కు ప‌ద‌వి ద‌క్క‌లేదు. దీంతో ఆయ‌న బోరున విల‌పించారు. ఈ మేర‌కు ప‌త్రిక‌ల్లో, టీవీ చానెళ్ల‌లో క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. ఆయ‌నకు మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో ధ‌ర్మ‌శ్రీ అనుచ‌రులు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. టైర్లు కాల్చి రోడ్ల‌పైన వేశారు.

దీంతో ఆయ‌న‌లో అసంతృప్తిని పోగొట్ట‌డానికి క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీని అన‌కాప‌ల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడిగా వైఎస్ జ‌గ‌న్ నియ‌మించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు ప్ర‌భుత్వ విప్ గా నియ‌మిస్తూ తాజా ఉత్త‌ర్వులు ఇచ్చార‌ని అంటున్నారు.

కాగా క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కాపు సామాజిక‌వ‌ర్గానికే చెందిన అన‌కాప‌ల్లి శాస‌న‌స‌భ స‌భ్యుడు గుడివాడ అమ‌ర్ నాథ్ కు మంత్రిప‌ద‌వి ల‌భించిన సంగ‌తి తెలిసిందే.

క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ 2004లో మాడుగుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో చోడ‌వ‌రం నుంచి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున గెలిచారు.

కాగా ఇటీవ‌ల 1998లో డీఎస్సీ పాసైన వారిని ప్ర‌భుత్వ టీచ‌ర్లుగా నియ‌మించ‌డంతో క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ కూడా ఆ అవ‌కాశం ద‌క్కించుకున్నారు. దీంతో సంతోషం వ్య‌క్తం చేసిన ఆయ‌న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు కూడా వెళ్లి పాఠాలు బోధించారు.