Begin typing your search above and press return to search.

పవన్ మీద రంగా అస్త్రం... పొత్తుని చిత్తు చేసే బాణం

By:  Tupaki Desk   |   3 Nov 2022 12:30 AM GMT
పవన్ మీద రంగా అస్త్రం... పొత్తుని చిత్తు చేసే బాణం
X
ఏపీ రాజకీయాల్లో కాపులు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారని చెప్పాలి. మొత్తం జనాభాలో ఇరవై శాతం వారి ఓట్లు ఉన్నాయి. దాంతో పాటు ఇపుడు జనసేన కులాలు అన్నీ సమానం మాకు అని చెబుతున్నా కాపులు సొంతం చేసుకుంటున్న పార్టీగా ఎదుగుతోంది. దాంతో ఏపీలో రాజకీయ వాటా కోసం జనసేన పోరు సాగిస్తోంది. ఈ నేపధ్యంలో జనసేన టీడీపీ పొత్తులకు అడుగులు వేగంగా పడుతున్నాయి. దానికి విజయవాడ వేదికగా చంద్రబాబు పవన్ భేటీ కావడం మీడియా ముందుకొచ్చి మాట్లాడడమే బలమైన సంకేతాలుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో కాపు ఓట్లలో తమ బలాన్ని రుజువు చేసుకోవడంతో పాటు వీలైనంత మేరకు ప్రత్యర్ధి పార్టీలను చిత్తు చేయడానికి వైసీపీ అనేక వ్యూహాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మీదకు రంగా అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఎపుడో మూడున్నర దశాబ్దాల క్రితం వంగవీటి రంగా దారుణ హత్యకు గురి అయ్యారు. అది టీడీపీ ప్రభుత్వం ఏలుబడిలో. దాంతో నాడు ఆ ప్రభుత్వం మీదనే కాపులంతా రగిలిపోయారు.

ఫలితంగా 1989 ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ కి పట్టం కట్టడంలో కాపుల పాత్ర చాలా కీలకం అయింది. ఇక ఈ మధ్యన పవన్ వ్యూహాత్మకంగా అన్నారో లేక కాపులను ఒక్కటి చేయాలనుకుని మాట్లాడారో తెలియదు కానీ రంగాను కాపులు కాపాడుకోలేకపోయారు అని అన్నారు. దాంతో కాపులు అంతా ఈసారి అయినా జనసేన రూపంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తన వెంట ఉండాలని అంతర్లీనంగా పవన్ ఈ మాటలు వాడారని భావించారు. అయితే కాపులు ఆ దిశగా ఎంతవరకూ పోలరైజ్ అవుతారో తెలియదు కానీ ఇపుడు పవన్ అన్న మాటలే వైసీపీకి అస్త్రంగా మారుతున్నాయి.

వంగవీటి రంగా మీద పవన్ ది అంతా మొసలి కన్నీరు అని వైసీపీకి చెందిన కాపు మంత్రులు గట్టిగా విమర్శలు చేశారు. వంగవీటి రంగా మీద ప్రేమ చూపిస్తూనే మరో వైపు ఆయన్నే హత్య చేయించిన పార్టీతో చేతులు కలపడమేంటని పాత అగ్గిని లేటెస్ట్ గా మంట పెట్టి మరీ వైసీపీ మంత్రులు రాజేశారు. కాపులకు ఐకానిక్ ఫిగర్ గా ఆరాధ్యదైవంగా రంగా ఉంటూ వస్తున్నారు. ఆయన హత్య ఎవరు చేశారు అన్నది పక్కన పెడితే ఆనాడు టీడీపీ సర్కార్ అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, అందునా అమరణ నిరాహార దీక్షలో ఉన్న నేత దారుణ హత్యకు గురి కావడం అంటే అది టీడీపీకి నాడూ నేడూ కూడా ఎపుడూ మచ్చ లాంటిదే.

దాంతోనే తెలివిగా వైసీపీ ఈ ఇష్యూని రైజ్ చేస్తోంది. దాంతో టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకుంటారు అని వైసీపీ పవన్ని కార్నర్ చేస్తోంది. ఈ విషయమో కాపులు కూడా సరైన వివరణ కోసం ఎదురుచూస్తారు అన్నది కూడా వాస్తవం. మరో వైపు కోస్తాలో సామాజిక సమీకరణల నేపధ్యాన్ని కూర్పుని పరిశీలిస్తే కనుక కమ్మ కాపు ఈక్వేషన్స్ పెద్దగా సెట్ కావు అనే భావన ఉంది. అంద్ ఇలా అనేక కారణాలతో వైసీపీ ఇపుడు రంగా అస్త్రాన్ని ఆయన మీదకు ప్రయోగిస్తోంది.

అయితే ఇప్పటికే టీడీపీలో రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే రాధాక్రిష్ణ ఉన్నారు. ఆయన గతంలో అంటే 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన రాధా ఆ సమయంలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు టీడీపీలో ఎవరో చేసిన తప్పునకు అందరికీ బాధ్యులను చేయలేమని రాధా చెబుతూ సైకిలెక్కేశారు. ఇపుడు కూడా వైసీపీ నుంచి వచ్చిన ఈ ఆస్త్రాన్ని చేదించే బాధ్యత రాధ మీదనే ఉంది అంటున్నారు.

ఆయన ఎటూ వైసీపీ వ్యతిరేక క్యాంప్ లోనే ఉన్నారు. పైగా జనసేనతో టచ్ లో ఉన్నారు అని అంటున్నారు. కాబట్టి ఆయన ఈ విషయంలో టీడీపీకి జనసేనకు మధ్య పొత్తు కుదరాలని కోరుకుంటే కనుక 2019 నాటి స్టేట్మెంట్ నే మళ్ళీ చదివితే సరిపోతొంది. రంగా కుమారుడే దీని మీద వివరణ ఇస్తే అపుడు వైసీపీ డిఫెన్స్ లో పడుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.