Begin typing your search above and press return to search.

లోటస్ పాండ్ నుంచినే టీడీపీకి డేటా లీక్ అయ్యిందా?

By:  Tupaki Desk   |   5 March 2019 4:53 PM GMT
లోటస్ పాండ్ నుంచినే టీడీపీకి డేటా లీక్ అయ్యిందా?
X
ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు డేటా చోరీ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పెను సంచలనంగా మారుతూ ఉంది. ఏపీ ప్రజలందరి డేటాను, వారి పూర్తి వివరాలను తీసుకుని.. ఎన్నికల సమయంలో ఉపయోగించుకునేందుకు డేటా చోరీకి పాల్పడ్డారనే మాట వినిపిస్తూ ఉంది. ఈ అంశం గురించి తెలంగాణ పోలీసుల విచారణ శరవేగంగా సాగుతూ ఉంది.

ఇప్పటికే డేటా స్టోరేజ్ విషయంలో అమేజాన్ - గూగుల్ సంస్థలకు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో ఈ డేటాకు సంబంధించిన పూర్తి వివరాలను అందించనున్నామని ఆ సంస్థలు తెలిపాయని పోలీసులు ప్రకటించారు. ఇక మరోవైపు ఐటీ గ్రిడ్స్ ఎంనీ అశోక్ లొంగిపోవడానికి ఇరవై నాలుగు గంటల గడువు ఇచ్చారు పోలీసులు. అయితే.. అతడు లొంగిపోలేదు. ఈ నేపథ్యంలో గడువు పూర్తి అయ్యిందని.. అతడిని పట్టుకోవడానికి చర్యలను ముమ్మరం చేయనున్నామని పోలీసులు ప్రకటించారు.

ఇక ఈ ఐటీ గ్రిడ్స్ వద్ద ఉన్న సమాచారం పూర్తి వివరాలను తెలుసుకుంటే విస్మయం కలగక మానదు. ఆ సంస్థ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఎవరు అనే అంశం గురించిన సమస్త సమాచారంతో పాటు..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి వివరాలూ ఉన్నాయని సమాచారం. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి బూత్ కమిటీ కన్వీనర్ల వివరాలూ ఉన్నాయట!

ఏపీలోని అన్ని నియోజకవర్గాల బూత్ కమిటీ కన్వీనర్ల డేటా అంతా తెలుగుదేశం పార్టీ అనుకూల సంస్థ వద్ద ఉందని సమాచారం! మరి అంత వివరమైన డేటాను తెలుగుదేశం ఎలా సొంతం చేసుకుంది. అంటే..బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచినే డేటా దొంగతనం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఎవరో వెన్నుపోటు దారులు ఉన్నారని, వారే తెలుగుదేశం పార్టీకి మొత్తం డేటాను అందించి ఉండవచ్చు అని తెలుస్తోంది. లేకపోతే మరీ ఆ స్థాయి వివరాలను తెలుగుదేశం పార్టీ వాళ్లు సంపాదించడం సులభం కాదని పరిశీలకులు అంటున్నారు. కన్వీనర్ల ఇంటి అడ్రస్సులు, వారి ఫోన్ నంబర్లు కూడా సంపాదించారంటే మాటలు కాదు. ఎన్నికల సమయంలో వారందరినీ ప్రలోభ పెట్టేందుకు ఈ డేటాను వినియోగించాలని భావిస్తున్నట్టుగా ఉన్నారు!