Begin typing your search above and press return to search.

ఉరిశిక్షను తప్పించిన వ్యాపార దిగ్గజం.. లులూ గ్రూప్ ఛైర్మన్ ఔదార్యం

By:  Tupaki Desk   |   4 Jun 2021 5:30 PM GMT
ఉరిశిక్షను తప్పించిన వ్యాపార దిగ్గజం.. లులూ గ్రూప్ ఛైర్మన్ ఔదార్యం
X
వేలాది కోట్లు ఉన్నా.. ప్రాణం పోయాక తిరిగి తీసుకురావటం కష్టం. ప్రమాదవశాత్తు జరిగిన ఒక ఘటనకు కారణమైన యువకుడి ప్రాణాలు ఉరిశిక్షతో పోవటాన్ని గుర్తించి.. స్పందించిన వ్యాపార దిగ్గజం ఔదార్యం ఇప్పుడు అందరి అభినందనల్ని అందుకుంటోంది. దేశం కాని దేశంలో అనుకోకుండా జరిగిన ప్రమాదానికి ఉరిశిక్షను ఎదుర్కొంటున్న కేరళ రాష్ట్రానికి చెందిన యువకుడ్ని రక్షించారు లులూ గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ. పొరపాటుగా జరిగిన తప్పు కారణంగా జీవితాన్ని కోల్పోతున్న వ్యక్తికి అండగా నిలిచి.. ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలేం జరిగిందంటే..

45 ఏళ్ల కృష్ణన్ కేరళ వాసి. యూఏఈలో ఉద్యోగం చేస్తున్నాడు. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం (2012) కారు యాక్సిడెంట్ చేశాడు. ఆ ప్రమాదంలో సూడాన్ కు చెందిన బాలుడు మరణించాడు. నిర్లక్ష్యంగా కారును నడిపి.. బాలుడి ప్రాణాలు పోవటానికి కారణమయ్యారంటూ కృష్ణన్ మీద కేసు నమోదైంది. ఈ కేసులో అతడ్ని అరెస్టు చేసి.. జైలుకు పంపారు. కోర్టు విచారణలో ప్రత్యక్ష సాక్ష్యలు ఇచ్చిన సాక్ష్యం.. సీసీ ఫుటేజ్ ను చూసిన కోర్టు.. అతడు నిర్లక్ష్యంతోనే డ్రైవింగ్ చేసినట్లుగా తేల్చి.. అతడికి ఉరిశిక్షను విధించింది.

సాధారణంగా యూఏఈలో ఉరిశిక్ష విధించిన వ్యక్తికి.. ఆ శిక్ష నుంచి తప్పించాలంటే.. బాధిత కుటుంబం అతడ్ని శిక్ష నుంచి తప్పించాలని కోరితే.. న్యాయస్థానం మరణశిక్షను తప్పిస్తుంది. కృష్ణన్ ఉదంతంలో బాధిత కుటుంబం సూడాన్ వెళ్లిపోయింది. వారిని ఎలా సంప్రదించాలో తెలీని పరిస్థితి. మరణశిక్షకు దగ్గరవుతున్న కృష్ణన్ ను కాపాడుకోవటానికి వారి కుటుంబం తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.

ఇలాంటివేళ.. కేరళలో ఫేమస్ అయిన లులూ గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ గురించి చెప్పి.. ఆయన్ను సంప్రదించాలని కోరారు. మొత్తంగా ఆయన్ను కలిసి.. కృష్ణన్ ను కాపాడాలని వేడుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలన్ని తెప్పించుకున్న ఆయన.. ఈ కేసులో కృష్ణన్ చేసిన ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందన్న భావనకు వచ్చారు.

ఆ వెంటనే.. కృష్ణన్ ను కాపాడేందుకు సూడాన్ లోని బాధిత కుటుంబాన్ని అబుదాబికి తెప్పించారు. వారి కుటుంబంతో దశల వారీగా మాట్లాడారు. ఎట్టేలకు క్షమాభిక్షను ప్రసాదించేందుకు ఆ కుటుంబం ఒప్పుకునేలా చేశారు. ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం బాధిత కుటుంబానికి కోటి రూపాయిల పరిహారం ఇచ్చేందుకు కృష్ణన్ తరఫున లులూ గ్రూప్ ఛైర్మన్ అంగీకరించటంతో అతడికి మరణశిక్ష తప్పింది. త్వరలోనే కేరళ యువకుడు తన సొంత రాష్ట్రానికి రానున్నారు. వేలాది కోట్లు సంపాదించటం ఒక ఎత్తు.. కష్టంలో ఉన్న వారిని ఆదుకోవటం మరో ఎత్తు. తాజా ఉదంతంలో లులూ గ్రూప్ ఛైర్మన్ మరోస్థాయికి వెళ్లారనే చెప్పాలి. ఆయన నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.