Begin typing your search above and press return to search.

ఫార్మర్ బీజేపీ ఎంపీ ఇండియా టీం కి కోచ్!

ఈ నేపథ్యంలో ఇప్పటికే గంభీర్ పేరు ఫైనల్ అయినా.. జీతభత్యాల విషయంలో చర్చలు సాగుతున్నట్లు కథనాలొచ్చాయి.

By:  Tupaki Desk   |   9 July 2024 3:13 PM GMT
ఫార్మర్  బీజేపీ ఎంపీ ఇండియా టీం కి కోచ్!
X

టీంఇండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ - 2024తో ముగిసిన నేపథ్యంలో త్వరలో కొత్త కోచ్ ను బీసీసీఐ నియమించనుందనేది తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే గంభీర్ పేరు ఫైనల్ అయినా.. జీతభత్యాల విషయంలో చర్చలు సాగుతున్నట్లు కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో జై షా కీలక ప్రకటన చేశారు.

అవును... ఈ నేలాఖరులో శ్రీలంకతో ప్రారంభమయ్యే టీ20, వన్డే సీరీస్ లకు కొత్త కోచ్ అందుబాటులో ఉంటాడని ఇప్పటికే ప్రకటించిన బీసీసీ కార్యదర్శి జై షా... తాజాగా ఆ కోచ్ ని ప్రకటించేశారు. ఇందులో భాగంగా టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ ను నియమిస్తున్నట్లు ఆన్ లైన్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు!

ఇందులో భాగంగా... "భారత క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ కు స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది" అని తెలిపిన జై షా... ఆధునిక క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందిందని.. గౌతమ్ ఈ మారుతున్న దృశ్యాన్ని దగ్గరగా చూశాడని అన్నారు. తన కెరీర్‌ లో వివిధ పాత్రల్లో అద్భుతంగా రాణించాడని తెలిపారు.

ఇదే సమయంలో క్రికెట్ కెరీర్ లో జట్టుకోసం ఎన్నో పాత్రలు పోషించిన గౌతమ్... ఇండియన్ క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం తనకుందని అన్నారు. ఆయన అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని జై షా తెలిపారు. ఈ సమయంలో అతనికి బీసీసీఐ అన్ని విధాలా పూర్తిగా సహకరిస్తుందని ఆయన వెల్లడించారు.

కాగా... ఈ నెల 27 నుంచి శ్రీలంక, భారత్ మధ్య మూడు టీ20 ల సీరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్ గా ఇది గంభీర్ కు ఫస్ట్ సిరీస్! ఈ క్రమంలో మూడు ఫార్మేట్లలోనూ హెడ్ కోచ్ గా ఈ ఏడాది జూలై నుంచి 2027 డిసెంబర్ వరకూ మూడున్నరేల్ల కాలానికి ఉంటారని గతంలో బీసీసీ చెప్పిన సంగతి తెలిసిందే.