చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. ప్రైజ్ మనీ ఎంతంటే?
ఈ మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్పై పెద్ద ఎత్తున ఊహాగానాలు జరిగాయి.
By: Tupaki Desk | 10 March 2025 12:40 PM ISTటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్, స్పిన్నర్లు ఇరగదీసే ప్రదర్శనతో భారత జట్టు న్యూజిలాండ్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి, రికార్డు స్థాయిలో మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
ఈ మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్పై పెద్ద ఎత్తున ఊహాగానాలు జరిగాయి. రోహిత్ ఫామ్ కొంతకాలంగా క్షీణించడం దీనికి ప్రధాన కారణం. అయితే, చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ తన సత్తా చాటుతూ టాప్ స్కోరర్గా నిలిచి విమర్శకులకు సమాధానమిచ్చాడు. హిట్మ్యాన్ నాయకత్వంలో భారత జట్టు 2024లో టీ20 వరల్డ్ కప్ను గెలుచుకోగా ఇప్పుడు మరో ఐసీసీ ట్రోఫీని అందుకుంది.
భారత్ 2002, 2013 తర్వాత మూడోసారి ఈ టైటిల్ను గెలుచుకుంది. అంతేకాకుండా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో మూడు సార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ అరుదైన రికార్డు సృష్టించింది.
ఈ ఘనవిజయం భారత్కు భారీ ప్రైజ్మనీని తెచ్చిపెట్టింది. భారత జట్టు 2.4 మిలియన్ డాలర్లు (రూ.19.5 కోట్లు) ప్రైజ్మనీగా పొందింది. ఐసీసీ గతంతో పోల్చితే ఈసారి ప్రైజ్మనీని 53% పెంచింది. రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్కు 1.12 మిలియన్ డాలర్లు (రూ.9.72 కోట్లు) లభించాయి. సెమీఫైనల్లో ఎలిమినేట్ అయిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు చెరో రూ.4.86 కోట్లు అందాయి.
ఈసారి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొత్తం ప్రైజ్మనీ 6.9 మిలియన్ డాలర్లు (సుమారు రూ.60 కోట్లు)గా నిర్ణయించబడింది. గ్రూప్ దశలో గెలిచిన జట్లకు రూ.30 లక్షల ప్రైజ్మనీ ఇవ్వనున్నారు. ఐదో, ఆరో స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.3 కోట్లు, ఏడో, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.1.2 కోట్లు లభించాయి. ఐసీసీ టోర్నీలో పాల్గొన్న ఎనిమిది జట్లకు రూ.1.08 కోట్లు అందాయి.
భారత జట్టు ఈ విజయంతో ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించింది.