Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ వెళ్లి ఆడటంపై కుల్దీప్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ మ్యాచ్ పై ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు, క్రీడాభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు.

By:  Tupaki Desk   |   27 Aug 2024 11:30 PM GMT
పాకిస్థాన్  వెళ్లి  ఆడటంపై కుల్దీప్  ఆసక్తికర వ్యాఖ్యలు!
X

ఇండియా – పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే దానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రత్యేకత వేరనే చెప్పాలి. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం అది ఈ రెండు దేశాల క్రికెట్ అభిమానులకు మాత్రమే పరిమితం కాదు.. ప్రత్యేకం కాదు. ఈ మ్యాచ్ పై ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు, క్రీడాభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు.

ఇక ఈ రెండు దేశాల్లో అయితే దీన్ని మైదానంలో జరిగే యుద్ధంగా చూస్తుంటారు ఫ్యాన్స్! ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న ఛాపియన్స్ ట్రోపీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో... భారత్ – పాక్ మ్యాచ్ లు మరోసారి చూసే అవకాశం ఉందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఈ నేపథ్యంలో కుల్దీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అవును... పాకిస్థాన్ వెళ్లి క్రికెట్ ఆడటంపై కుల్దీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా... క్రికెటర్లుగా తమను ఎక్కడికి పంపినా వెళ్లి ఆడటానికి సిద్ధంగా ఉంటానని.. అది తమ బాధ్యత అని తెలిపాడు. ఇదే సమయంలో... తాను ఇంతకు ముందెన్నడూ పాకిస్థాన్ వెళ్లి ఆడలేదని.. అవకాశం వస్తే తప్పకుండా వెళ్లి ఆడతానని కుల్దీప్ తాజాగా వెళ్లడించాడు.

కాగా.. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోపీకి పాక్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ముసాయిదా షెడ్యూల్ ను పాక్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ).. ఐసీసీకి సమర్పించింది. దీని ప్రకారం 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకూ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది!

అయితే... ఆటగాళ్ల భద్రతతోపాటు ఇతర కారణాల వల్ల భారత్ చాలా కాలంగా పాక్ పర్యటనకు వెళ్లడం లేదు! దీంతో.. ఇప్పుడు టీంఇండియా పాకిస్థాన్ కు వెళ్తుందా అనేది ఆసక్తిగా మారింది. ఈ నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కుల్దీప్ తన అభిప్రాయాన్ని వెళ్లడించాడు.