Begin typing your search above and press return to search.

భారతదేశాన్ని వదులుకుంటున్న భారతీయులు.. లెక్కలివే!

పౌరసత్వాన్ని వదులుకునే ఈ ధోరణి

By:  Tupaki Desk   |   24 July 2023 5:12 AM GMT
భారతదేశాన్ని వదులుకుంటున్న భారతీయులు.. లెక్కలివే!
X

నా జన్మ భూమి.. భూమి.. భూమి.. అని ఎకో సౌడ్ లో అనుకున్నా... నా జన్మభూమి అంత అందమైన దేశమూ, నా ఇల్లు అందులోని కమ్మనీ ప్రదేశమూ అని పాట పాడుకున్నా.. అది పేద, మధ్యతరగతి వర్గాలే తప్ప... సంపన్నులు కాదని, ఒకసారి విదేశాల్లో గ్రీన్ కార్డులు వంటివి వచ్చాక.. భారతదేశ పౌరసత్వాన్ని వదులుకోవడానికి రెడీగా చాలామంది ఉన్నారని ఘణాంకాలు చెబుతున్నాయి.

అవును... భారతదేశాన్ని వదులుకోవడానికి చాలా మంది భారతీయులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. భారతదేశ పౌరసత్వాన్ని శాస్వతంగా వదులుకుని, ఇతర దేశాల్లో శాస్వత స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వారంతా సిద్ధమవుతున్నారు. వీరిలో అత్యంత సంపన్న భారతీయులు కూడా ఉండటం గమనార్హం.

2023లో సుమారు 87,000 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ క్రమంలో జూన్ నెల నాటికే వీరి సంఖ్య 87,026 గా ఉంది. వీరిలో సుమారు 6,500 మంది సంపన్న భారతీయులు ఉన్నారని హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ - 2023 నివేధికను వెల్లడించింది.

ఇలా భారతదేశ పౌరసత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడిన వారు యునైటెడ్ స్టేట్స్, పాకిస్తాన్, జర్మనీతో సహా 135 దేశాలకు వలస వెళ్ళినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ విషయాలపై స్పష్టత ఇచ్చారు. దీనికి గల కారణాలను పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు.

పౌరసత్వాన్ని వదులుకునే ఈ ధోరణి చాలా సంవత్సరాలుగా నడుస్తుంది. అయితే 2022లో, రికార్డు స్థాయిలో 2,25,620 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇది గత 12 ఏళ్లలో హైఎస్ట్ నెంబర్ అని చెబుతున్నారు. పైగా కోవిడ్ కి ముందు కంటే.. ఆ మహమ్మారి తర్వాత వీరి సంఖ్య పెరుగుతుందని తెలుస్తుంది.

లోక్‌ సభ ఎంపీ కార్తీ చిదంబరం అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందనగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ డేటాను వెల్లడించింది. ఇది ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది. ఇదే సమయంలో వారిని ఆపడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. దీనికోసం మేక్ ఇన్ ఇండియా ను ఉపయోగించుకున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు.

అవును... చాలా మంది భారతీయ పౌరులు విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించడానికి ఎంచుకున్నారని, అయితే ఈ ప్రతిభావంతులైన వ్యక్తులను "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమం ద్వారా దేశంలో ఉండేలా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి చెబుతున్నారు.

గత కొన్ని సంవత్సరాల నుండి వచ్చిన డేటా పౌరసత్వాన్ని వదులుకునే భారతీయుల సంఖ్యలో స్థిరమైన పెరుగుదలను చూపుతుందని తెలుస్తుంది. మహమ్మారికి ముందు, వార్షిక గణాంకాల ప్రకారం... సుమారు 1.2 లక్షల నుండి 1.5 లక్షల మంది ఈ లిస్ట్ లో ఉండగా.. మహమ్మారి అనంతర కాలంలో 2022లో 2,25,620 మంది వ్యక్తులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు.

ఇక వీరిలో సంపన్నులు కూడా అత్యధికంగా ఉన్నారని ఘణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 6,500 మంది సంపన్న భారతీయులు భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది

ఇది ప్రపంచంలోనే రెండొ పెద్ద నెంబర్... కాగా... మొదటి స్థానంలో చైనా ఉంది. అవును... చైనా నుంచి 13,500 మంది దేశాన్ని వదిలి ఇతరదేశాల్లో సెటిల్ కాబోతున్నారని హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ - 2023 చెబుతున్నమాట.

మరి ఇలా భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడుతున్న భారతీయుల నెంబర్ పెరగకుండా ప్రభుత్వం నిలువరించగలుగుతుందా.. వారిని ఆపగలుగుతుందా.. లేక అచేతనంగా చూస్తుండిపోతోందా అన్నది వేచి చూడాలి!